Telangana: తెలంగాణ ఏర్పాటులో బీజేపీది కీ రోల్ : రాజ్నాథ్ సింగ్
Telangana Elections: తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేవలం కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ ఏర్పడలేదని తెలిపారు. అటు మజ్లిస్ కోరలు పీకాలంటూ జనగర్జనసభలో కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం పదండి...

అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో జాప్యం చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రచారంలో మాత్రం బీజేపీ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచార శంఖారావం పూరించగా తాజాగా తెలంగాణలో రెండుచోట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో నిర్వహించిన జనగర్జనసభలో ముఖ్య అతిధిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. జమ్మికుంట నుంచి హైదరాబాద్ శివారు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేటలో నిర్వహించిన బహిరంగ సభలో రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్య ప్రాంతం తెలంగాణ అని రాజ్నాథ్సింగ్ కొనియాడారు. కేవలం కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ ఏర్పడలేదని, అందులో బీజేపీ పాత్ర కూడా ఉందని తెలిపారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో బీజేపీ కూడా కీలక భూమిక పోషించింది. అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్ను విభజించాలి, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేయాలని, తెలంగాణ కూడా వేగంగా అభివృద్ధి చెంది ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పాను” అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
బడంగ్ పేట సభలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మజ్లిస్పై నిప్పులు చెరిగారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే మజ్లిస్ కోరలు పీకాలని పిలుపు ఇచ్చారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేందుకు రేపో, మాపో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..