Railway Doubling: బీబీనగర్ -గుంటూరు మధ్య డబ్లింగ్కు మోక్షం.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు తగ్గనున్న దూరాభారం
Doubling of Bibinagar- Guntur: తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్, గుంటూరు మధ్య 239 కి.మీ. డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. రూ.2,853.23 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. డబ్లింగ్ నిర్మాణ పనులకు త్వరలో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయనుంది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కీలకమైన సికింద్రాబాద్- నడికుడి రైల్వే మార్గానికి డబ్లింగ్ కు మోక్షం లభించింది. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలంటూ ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ మార్గంలో బీబీనగర్ – గుంటూరు మధ్య 239 కి.మీ. రెండో లైను నిర్మాణ పనులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు రైల్వే శాఖ డబ్లింగ్ పనుల ప్రాజెక్టును మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్- నడికుడి- గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్, గుంటూరు మధ్య 239 కి.మీ. డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. రూ.2,853.23 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. డబ్లింగ్ నిర్మాణ పనులకు త్వరలో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయనుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు తగ్గనున్న దూరభారం
బీబీనగర్- నడికుడి- గుంటూరు రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేస్తే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైలకు దూరభారం తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే.. నడికుడి, గుంటూరు మార్గంలో దాదాపు 46 కి.మీ. దూరం తక్కువ ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ – విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే రూట్లు ఉన్నాయి. ఇందులో కాజీపేట – ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తే సికింద్రాబాద్ – విజయవాడ మధ్య 350 కి.మీ దూరం ఉంది. మరో మార్గమైన బీబీనగర్- నడికుడి- గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336 కి.మీ మాత్రమే ఉంది.
దీంతో బీబీనగర్ నడికుడి రైల్వే మార్గం అత్యంత రద్దీ మార్గంగా మారింది. దక్షిణ మధ్య రైల్వేలోఈ ట్రాక్ సామర్థ్య వినియోగం ఏకంగా 148.25 శాతం ఉంది. సింగిల్ ట్రాక్ కావడంతో.. ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్లో నిలపాల్సి వస్తోంది. దీంతో రైళ్లు.. రైల్వే స్టేషన్ లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న సింగిల్ ట్రాక్ లైన్ గరిష్ఠ వేగ సామర్థ్యం 130 కి.మీ. మాత్రమే ఉంది.
ఇప్పటికే ఈ మార్గంలో 160 కిలోమీటర్ల వేగ సామర్థ్యం కలిగిన వందే భారత్ రైళ్లు వేగ సామర్థ్యాన్ని తగ్గించుకుని నడుస్తున్నాయి. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల వేగం పెరగడం తోపాటు అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది. బీబీనగర్-గుంటూరు రైలు మార్గంలో డబ్లింగ్ చేసే 239 కిలోమీటర్లలో 139 కి.మీ. రైల్వే ట్రాక్ తెలంగాణ పరిధిలో, వంద కి.మీ. రైల్వే ట్రాక్ ఏపీ పరిధిలోకి వస్తుంది.
డబ్లింగ్ తో తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం..
ఈ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అయ్యే సిమెంటు, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరంగా ఉంటుంది. ఈ మార్గంలోని నడికుడి, జగ్గయ్యపేట, విష్ణుపురం, మేళ్లచెరువు, జాన్ పహాడ్ ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సిమెంట్ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఈ లైను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చిట్యాల నార్కెట్ పల్లి ప్రాంతాల్లో ఐరన్ స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ఉత్పత్తుల రవాణాకు డబ్లింగ్ లైన్ తో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం