Bandi Sanjay: క్యాసినో స్కామ్లో టీఆర్ఎస్ నేతలు.. తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న బండి సంజయ్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు భవిష్యత్ ఉండదని భావించే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొందరు నేతలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు.
తెలంగాణలో (Telangana)మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay). మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరిలో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే (TRS MLA)లు ప్రజలతో ఒత్తిడి తెప్పించుకుని రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు భవిష్యత్ ఉండదని భావించే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొందరు నేతలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు. మునుగోడులో(Munugode Assembly) బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందిలావుంటే రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సంగతిని ఇప్పటికే అన్ని సర్వేలు వెల్లడించాయని.. రెండు రోజుల క్రితం వచ్చిన రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయని అన్నారు. వారు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం ఎన్నికలు వస్తే 60 నుంచి 65 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు.
గతంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండింటిలో బీజేపీ గెలిచిందిని.. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని.. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని వెల్లడించారు. క్యాసినోతోపాటు ఇతర వ్యవహారాల్లో కుటుంబంపై ఆరోపణలు వస్తుండటంపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
క్యాసినో కుంబకోణంలో అధికార పార్టీ నేతలు చాలామంది ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. నయీం ఆస్తుల కేసులో కూడా ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే విచారణ జరిపించాలని.. నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న డైరీ, నగదు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం