ఆడవాళ్ల నవ్వుల వెనుక ఇంత బాధా? పురుషుల కంటే ఎక్కువ కాలం నరకం అనుభవిస్తున్న మహిళలు!
Women Health Issues: మహిళలు పురుషుల కంటే సగటున ఎక్కువ కాలం జీవిస్తున్నప్పటికీ, వారి జీవితంలో ఎక్కువ సంవత్సరాలు అనారోగ్యం, నొప్పులు, మానసిక ఒత్తిడితోనే గడుస్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తహీనత, దీర్ఘకాలిక నొప్పులు, గృహ హింస వంటి సమస్యలు భారతీయ మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి నవ్వుల వెనుక దాగి ఉన్న ఈ ఆరోగ్య సంక్షోభం గురించి తెలుసుకోండి.

ఆమె సృష్టికి మూలం.. ఇంటికి దీపం.. రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కర్మయోగి.. కానీ.. అదే మహిళ ఇవాళ నరకం అనుభవిస్తోంది. అవును.. మనం చూస్తున్నది నిజం కాదు, సమాజం నమ్ముతున్నది నిజం కాదు. మహిళలు ఎక్కువ కాలం బతుకుతున్నారు.. కానీ ఆ బతుకంతా నరకప్రాయంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక సంచలన పరిశోధన ఇప్పుడు షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ల్యాన్సెట్ అధ్యయనంలో తేలిన ఆ చేదు నిజాలు ఏంటి? మన ఇంట్లోని ఆడవాళ్లు లోలోపల ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు?
ఇల్లాలి నవ్వుల వెనుక.. దాగున్న నిశ్శబ్ద రోదన ఇది..
అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువే.. పురుషులు సగటున 71 ఏళ్లు బతికితే.. మహిళలు 76 ఏళ్లు బతుకుతున్నారు. కానీ.. ఈ ఐదేళ్ల అదనపు జీవితం వారికి వరం కాదు.. శాపంగా మారుతోంది. ఎందుకంటే, మగవారి కంటే ఆడవారే ఎక్కువ కాలం రోగాల బారినపడి నరకం అనుభవిస్తున్నారు. పురుషులు తమ జీవితంలో సగటున 9 ఏళ్లు అనారోగ్యంతో గడిపితే.. మహిళలు ఏకంగా 12 ఏళ్లు నొప్పులతో, వైకల్యంతో పోరాడుతున్నారు.
అసలు ఆడవారిని పిప్పి చేస్తున్న ఆ శత్రువులు ఎవరు?
గర్భధారణ, ప్రసవ సమయాల్లోనే కాదు.. వారి జీవితాంతం వేధించే దీర్ఘకాలిక రోగాలు నడుము, మెడ నొప్పి.. మహిళల నాణ్యమైన జీవితాన్ని దెబ్బతీస్తున్న నంబర్ వన్ విలన్. లోలోపల నలిపేసే ఆందోళన, ఒత్తిడి.కీళ్ల నొప్పులు, మైగ్రేన్. మగవారు గుండె జబ్బులు, ప్రమాదాల వల్ల త్వరగా మరణిస్తుంటే.. మహిళలు మాత్రం చావలేక, బతకలేక.. ఈ దీర్ఘకాలిక నొప్పులతో జీవితాంతం యుద్ధం చేస్తున్నారు.
ఇక మన దేశంలో పరిస్థితి మరీ ఘోరం..
గణాంకాలు చూస్తే గుండె తరుక్కుపోక మానదు. భారతదేశంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో.. ఏకంగా 53.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే సగానికి పైగా ఆడవారి ఒంట్లో జీవం లేదు. దీనికి తోడు 20.3 శాతం మంది మహిళలు గృహ హింసకు బలవుతున్నారు. అటు శారీరక హింస.. ఇటు మానసిక క్షోభ.. వెరసి భారతీయ మహిళల ఆరోగ్యం ఛిద్రమవుతోంది.
కంటికి కనిపించని ఈ మహమ్మారుల కంటే.. సమాజం చూపిస్తున్న నిర్లక్ష్యమే పెద్ద శాపంగా మారింది. మన వైద్య వ్యవస్థలు కేవలం ప్రసవాల సమయంలోనే మహిళల ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నాయి. కానీ, వారి జీవితాంతం వేధించే ఇలాంటి దీర్ఘకాలిక రోగాలను గాలికొదిలేశాయి. ఇప్పటికైనా మారాల్సింది సమాజం.. మారాల్సింది కుటుంబాల ఆలోచనా విధానం. మీ ఇంట్లో అమ్మ, భార్య, కూతురు నాకేం కాలేదులే అని చెప్పే అబద్ధాన్ని నమ్మకండి. వారి నవ్వుల వెనుక ఉన్న నొప్పులను గుర్తించండి. వారికి కేవలం ఆయుష్షు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం మనందరి బాధ్యత.
