Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులకు భవిష్యత్తును ప్రసాదించాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తాను పాఠాలు చెప్పే పాఠశాల ఎదుటే దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడు కళ్ళముందే మంటల్లో కాలిపోవడం చూసి విద్యార్థులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తాను పనిచేస్తున్న స్కూల్ ముందూ ఓ ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గోపవరం మండలం రామిరెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో మల్లెం కొండయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పాఠశాల విధుల్లో ఉన్న సమయంలో, ఆయన ఒక సంచిలో కట్టెలు, పెట్రోల్ బాటిల్ను తీసుకొని వెళ్లినట్లు విద్యార్థులు గమనించారు. అనంతరం పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాల కారణంగా కొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే తమకు పాటు చెప్పిన పంతులు తమ కళ్ల ముందే కాల్చుకొని ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థులు సైతం చలించిపోయారు. వెంటనే స్కూల్లోని తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు పోలీసులకు తెలియజేయడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కుటుంబ కలహాలే కారణమా?
అయితే కొండయ్యది గోపవరం మండలం బ్రాహ్మణపల్లి సొంత గ్రామం కాగా, ప్రస్తుతం ఆయన బద్వేల్ టౌన్లో నివాసముంటున్నారు. ఆయనకు పదవ తరగతి చదువుతున్న ఒక కుమార్తె కూడా ఉంది. ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
