Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం.. పిడుగులు పడి పలువురు మృతి.. భారీగా పంట నష్టం
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలు చోట్ల నష్టాన్ని....
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలు చోట్ల నష్టాన్ని మిగిల్చింది. పిడుగు పాటుకు పలువురు మృత్యువాత పడ్డారు. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. పంటచేలల్లో ధాన్యం రాలిపోగా, కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య పొలం వద్ద పనులు చేస్తుండగా, వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు పిడుగు పడి మరణించాడు.
అలాగే మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో పిడుగు పాటుకు ఇటుక బట్టి కార్మికుడు దొగ్రి ఈశ్వర్ మృతి చెందాడు. మరో కార్మికుడు సంజయ్ అపస్మారక స్థితికి చేరుకోగా, ఆస్పత్రికి తరలించారు. తోగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన మిద్దె లక్ష్మీ, భీమరి ఎల్లవ్వ, బెస్త వెంకటవ్వ, బెజ్జరమైన సుజాత వ్యవసాయ పనులకు వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోనిని ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇక ముత్యంపేట, ముబరాస్పర్ గ్రామాల్లో పిడుగుపాటుతో 3 పశువులు మృతి చెందాయి. గొల్లపల్లిలో పిడుగు పాటుకు 15 మేకలు మృతి చెందాయి. చేర్యాల మండలం గుర్జకుంటలో పిడిగుపడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి. ఇలా అకాల వర్షం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినగా, పిడుగు పాటుకు పలువురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా మనూర్ తండాకు చెందినా కిషన్ నాయక్.. కొమిని బాయి అనే ఇద్దరు దంపతులు వారి చేనులో కోత కోసిన జొన్నలను వర్షంలో తడుస్తున్నాయని దాని మీద పరదా కప్పడానికి వెళ్లి అర్ధరాత్రి పిడుగుపాటుకు గురై దంపతుల మృతి చెందారు. వీరి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
Also Read: ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్