Assam CM on KCR: వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ రుజువు ఇదిగో.. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది.
Assam CM on KCR: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma), తెలంగాణ(Telangana) సీఎం కే.చంద్రశేఖర్ రావు మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. సర్జికల్ స్ట్రైక్(Surgical Strikes) రుజువు కావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ప్రకటనను కేసీఆర్ సమర్థించారు. రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అస్సాం సీఎంను కేసీఆర్ కోరారు. దీనిపై హేమంత్ బిస్వా శర్మ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదిక పోస్ట్ ద్వారా సర్జికల్ స్ట్రైక్ రుజువు చూపించారు
సర్జికల్ స్ట్రైక్కు సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేసిన బిస్వా శర్మ.. “డియర్ కేసీఆర్, మా వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ రుజువు ఇదిగో.. అయినా మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నించి అవమానిస్తున్నారు. మీరు మాపై ఎందుకు దాడికి తెగబడుతున్నారు. భారత సైన్యాన్ని పరువు తీస్తారా? మన సైన్యంపై జరిగిన అవమానాన్ని భారతదేశం సహించదు.” అంటూ పేర్కొన్నారు.
2016లో పాకిస్థాన్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన వైమానిక దాడులకు సంబంధించిన ఆధారాలను రాహుల్ గాంధీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ర్యాలీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వివాదాస్పద ప్రకటన చేస్తూ.. ‘నువ్వు రాజీవ్గాంధీ కొడుకువా కాదా అని మేం అడగలేదు.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అడిగే హక్కు లేదు’ అని బిస్వా శర్మ అన్నారు. ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని రాహుల్ గాంధీకి వత్తాసు పలికారు. రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్పై రుజువు అడగడంలో తప్పు లేదు.. ఇంతకీ నేను అడుగుతున్నాను.. ఆధారాలు భారత ప్రభుత్వం చూపించండి.. అది వారి బాధ్యత అని కేసీఆర్ మీడియా సమావేశంలో అన్నారు. ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. అందుకే ప్రజలు రుజువు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీరు రాజు కాదు. ఇది కాకుండా, తన వివాదాస్పద ప్రకటనకు క్షమాపణలు చెప్పాలని అస్సాం సీఎం బిస్వా శర్మను కోరారు.