AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పిడుగులతో జాగ్రత్త..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పిడుగులతో జాగ్రత్త..
Ap And Telangana Weather Report
Krishna S
|

Updated on: Mar 19, 2026 | 1:50 PM

Share

తెలుగ రాష్ట్రాల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఏపీ తీరప్రాంతం, యానాం పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీనికి తోడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృత వాతావరణం ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి.

ప్రాంతాల వారీగా 3 రోజుల సూచన

ఉత్తర కోస్తా, యానాంలో గురువారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. శుక్రవారం, శనివారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో గురువారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. రాగల మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

రాయలసీమ

గురువారం రాయలసీమలో అనేక చోట్ల వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచనతో పాటు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో

తెలంగాణలో ఉపరితల ద్రోణి,కోస్తాంధ్ర తీరంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షాల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడి, ఆ తర్వాతి రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పిడుగుపాటు హెచ్చరిక

మూడు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన జల్లులు పడవచ్చని తెలిపారు. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ప్రయాణికులు చెట్ల క్రింద నిలబడరాదని, సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

Follow Us