Telangana: రక్తార్పణమే నైవేద్యం.. ఊరంతా పూనకాలతో ఊగిపోయే సమ్మక్క తమ్ముడి జాతర గురించి తెలుసా..?
ఆ జాతరలో రక్తార్పణమే అతి కీలకం.. గుట్ట పై నుండి బాల కుమారస్వామి ఆగమనం సందర్భంగా ఊరంతా పూనకాలతో ఊగిపోతారు.. ఇంటికో కోడి లేదంటే మేక తల తెగాల్సిందే.. అక్కడి గిరిజన ఆచార సాంప్రదాయాలకు ప్రతిరూపంగా జరిగే బాలా కుమారస్వామి జాతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతినే దైవంగా పూజించే గిరిజన ఆచార సాంప్రదాయాలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జాతరలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ములుగు జిల్లాలోని అంకన్నగూడెం గ్రామంలో జరిగే బాల కుమార స్వామి జాతర మారుమూల గిరిజనుల ఆచార సంప్రదాయాలకు నిలువుటద్దం పడుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర తరహాలోనే ఈ గ్రామంలో కూడా ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క జాతర తిరుగువారం రోజున ఇక్కడి గిరిజనులు బాలకుమారస్వామి జాతర నిర్వహిస్తారు. సమ్మక్కకు స్వయాన తమ్మునిగా భావించి బాల కుమారస్వామికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.
అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గుట్టపై నుండి బాల కుమారస్వామిని గిరిజన పూజారులు ఓ ముంత రూపంలో గుడికి తీసుకొస్తారు. ఈ క్రమంలో ఊరంతా పూనకాలతో ఊగిపోతారు. ప్రతి ఇంటికి ఒకరు కోడిని లేదంటే మేకను బలిచ్చి రక్తార్పణం చేస్తారు. దేవున్ని గుట్ట పై నుండి గుడికి తీసుకొచ్చే సమయంలో చాలామంది తడి బట్టలతో కింద పడుకొని పూజరాలతో తొక్కించుకుంటారు. మేడారం జాతరకు ఉన్నంత విశిష్టత బాల కుమార్ స్వామికి ఉందని ఇక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం రెండేళ్లకోసారి గుట్టపై నుండి స్వామివారిని కిందకు దించి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మళ్లీ వన ప్రవేశం చేస్తామని చెప్తున్నారు.
