రక్త పరీక్షలకు ఒప్పుకోని రోగిష్టి భర్త.. ఉరేసుకుని భార్య సూసైడ్!
చిన్న చితక కారణాలనకే నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎవరికి ప్రాణాలపై తీపి ఉండటం లేదు. ఒక్కోసారి ఈ మాత్రం దానికే అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహం కూడా వస్తుంది.. తాజాగా ఓ మహిళ భర్త రక్త పరీక్షలు చేయించుకోవడం లేదనీ సహనం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది...

జూలపల్లి, మార్చి 23: కాదేదీ ఆత్మహత్యకు అనర్హం అనే తీరుకు చేరుకుంది నేటి జనాల పోకడ. కేవలం చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అటువంటి విచిత్ర ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన అతగాడికి వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో భర్తకు రక్త పరీక్షలు చేయించేందుకు భార్య సమాయత్తమైంది. అయితే పెనిమిటి మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన భార్యమణి ఇంటికొచ్చి పురుగుల మందు తాగి, ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ..
జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన మేకల పద్మ (48), తిరుపతి దంపతులు. వీరు బతుకు దెరువు కోసం 13 ఏళ్ల క్రితం మలేషియా వెళ్లి ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి తిరుపతి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో పద్మ కలత చెందింది. దీంతో గత కొన్ని రోజులుగా పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. ఎన్నాళ్లు వైద్యం చేయించినా జ్వరం తగ్గక పోవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు భర్తను తీసుకెళ్లింది. అక్కడ పరీక్షంచిన వైద్యులు క్షయ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.
దీంతో మరికొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించాడు. ఎంత చెప్పినా రక్త పరీక్షలు చేయించుకోకపోవడంతో భార్య పద్మ మనస్తాపం చెందింది. దీంతో ఆమె పురుగుల మందు తాగి, ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సనత్కుమార్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.