Rain Alert: గ్రేటర్ వాసులకు హెచ్చరిక.. వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో వానలు! జర పైలం..
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 23) కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చే 24 గంటల్లో..

హైదరాబాద్, మార్చి 23: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల గత రెండు రోజుల నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 23) కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇక హైదరాబాద్లో వచ్చే 24 గంటల్లో పలుచోట్ల పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నిన్నమొన్నటి వరకు ఎండలతో హడలెత్తిపోయిన గ్రేటర్ వాసులు ద్రోణి ప్రభావంతో కొంత ఉపశమనం పొందారు.శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో నేడు గరిష్టంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న భద్రాచలంలో 38.5 డిగ్రీలు, ఖమ్మం 37.6 డిగ్రీలు, మహబూబ్ నగర్ 37 డిగ్రీలు, ఆదిలాబాద్ 36.8 డిగ్రీలు, మెదక్ 36.6 డిగ్రీలు, రామగుండం 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని.. ఆ తరువాత నుండి ఎండల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో వింత వాతావరణం..
ఏపీకి విపత్తుల నిర్వహణసంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు, పిడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. నిన్న 17 ప్రాంతాల్లో 10మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో నేడు 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం నాడు కర్నూలు జిల్లా ఆస్పరి 40.3 డిగ్రీలు, శ్రీ సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నిండ్రలో 39.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి 39.8 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 39.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.