IPL 2026: ఆ విషయంలో బీసీసీఐకి ఇచ్చిపడేసిన విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?
IPL Privacy Rules: ఐపీఎల్ 2026 సీజన్ వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదానంలోనే కాకుండా ప్రాక్టీస్ సెషన్స్, డ్రెస్సింగ్ రూమ్లలో ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలను సైతం కెమెరాల్లో బంధించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్ల ప్రైవసీని కాపాడాలంటూ బీసీసీఐకి కోహ్లీ పంపిన ఈ డిమాండ్ నోటీస్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

IPL Privacy Rules: భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కేవలం ఒక ఆట మాత్రమే కాదు, కోట్ల మంది అభిమానుల భావోద్వేగం. వేసవి కాలంలో రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే, ఈ విపరీతమైన క్రేజ్ ఇప్పుడు ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు (ప్రైవసీ) పెద్ద ముప్పుగా పరిణమించింది. ఎటు చూసినా కెమెరాల నిఘా ఉండటంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇటీవల ఆర్సీబీ నిర్వహించిన ఒక ప్రత్యేక పాడ్కాస్ట్లో కోహ్లీ మాట్లాడుతూ, మైదానంలో ఆటగాళ్ల చుట్టూ నిరంతరం కెమెరాలు ఉండటం వల్ల తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్లలో గానీ, సహచర ఆటగాళ్లతో వ్యక్తిగత సంభాషణలు జరిపేటప్పుడు గానీ కనీస ప్రైవసీ కరువైందని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత కంటెంట్ క్రియేషన్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ పేరిట క్రికెటర్ల ప్రతి కదలికను రికార్డు చేయడం సరికాదని హితవు పలికాడు.
నెట్స్లో ప్రయోగాలు చేయలేకపోతున్నాం..!
“మనం ప్రాక్టీస్ గ్రౌండ్లోకి అడుగు పెట్టగానే ఆరు కెమెరాలు మనల్ని వెంబడించడం అస్సలు సౌకర్యంగా ఉండదు. ఒక క్రీడాకారుడిగా ప్రశాంతమైన వాతావరణంలో నా ఆటను మెరుగుపరుచుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నెట్స్లో మేము చేసే ప్రతి చిన్న పనిని రికార్డు చేసి, సోషల్ మీడియాలో దానిపై చర్చలు పెట్టడం వల్ల ఆటగాళ్లు సహజత్వాన్ని కోల్పోతున్నారు. మ్యాచ్లలో మా ప్రదర్శనను బట్టి మమ్మల్ని అంచనా వేయండి, అంతేకాని ప్రాక్టీస్ సెషన్లలో మేము చేసే ప్రయోగాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు” అని కోహ్లీ ఘాటుగా స్పష్టం చేశాడు.
బీసీసీఐ ఈ నిరంతర కెమెరా నిఘాపై పునరాలోచించాలని, ఆటగాళ్లను ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే అంశాలపై స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని కోహ్లీ డిమాండ్ చేశారు. ఆటగాడి అనుమతి లేకుండా ప్రతి క్షణాన్ని రికార్డు చేయడం ఇకనైనా ఆపాలని కోరాడు.
వివాదాలకు కేంద్రంగా మారిన ఐపీఎల్ 2026 కెమెరాలు..
విరాట్ కోహ్లీ వ్యక్తం చేసిన ఆందోళనలు కేవలం ఊహాజనితం కావు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లోనే కెమెరాల అతి వల్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కొన్ని ఇబ్బందికర దృశ్యాలను బ్రాడ్కాస్టర్ కెమెరాలు లైవ్లో చూపించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ, సదరు ఆటగాడి ప్రవర్తనను తప్పుబడుతూ భారీ జరిమానా కూడా విధించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్రికెటర్ల ప్రైవసీని కాపాడాలనే కోహ్లీ డిమాండ్ న్యాయబద్ధమైనదే అయినప్పటికీ, బీసీసీఐకి ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే బ్రాడ్కాస్టర్ల ద్వారానే బోర్డుకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. కెమెరాల విజువల్స్ పై ఆంక్షలు విధిస్తే ఆదాయ వనరులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రైవసీ వివాదంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
