AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!

Sunil Gavaskar Angry on Team India Fielding: దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన ఈ సునిశిత విమర్శలు ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. రాబోయే సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ, సెలెక్టర్లు ఈ ఫీల్డింగ్ లోపాలను వెంటనే సరిదిద్దుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!
Sunil Gavaskar Angry On Team India Fielding
Venkata Chari
|

Updated on: Jul 29, 2026 | 7:10 AM

Share

Sunil Gavaskar Angry on Team India Fielding: జింబాబ్వేపై టీ20 సిరీస్ గెలిచినా టీమిండియా చెత్త ఫీల్డింగ్ ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మైదానంలో చురుగ్గా కదల్లేని ఆటగాళ్లను వెంటనే జట్టు నుంచి నిర్దాక్షిణ్యంగా పీకేయాలని సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ముగ్గురు నలుగురు చెత్త ఫీల్డర్లతో కెప్టెన్ మ్యాచ్‌లు ఎలా గెలుస్తాడంటూ మేనేజ్‌మెంట్‌కు గట్టిగా చురకలు అంటించాడు.

ఆ చెత్త ఆటగాళ్లను ఇంటికి పంపండి..!

జింబాబ్వే పర్యటనలో కుర్రాళ్లతో కూడిన భారత జట్టు 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆటగాళ్ల తీరు చూసి భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్పోర్ట్‌స్టార్ పత్రికకు రాసిన తన ప్రత్యేక కాలమ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలను చీల్చి చెండాడాడు. జట్టులో ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు నలుగురు అత్యంత చెత్త ఫీల్డర్లు ఉన్నారని, బంతి ఎక్కడ తమ వైపు వస్తుందోనని వారు వణికిపోతున్నారని మండిపడ్డాడు. అలాంటి వాళ్ళను కెప్టెన్ ఫీల్డింగ్‌లో ఎక్కడో ఒకచోట దాచిపెట్టాల్సిన ఖర్మ పట్టిందన్నాడు. ఫీల్డింగ్‌లో ఏమాత్రం చురుగ్గా లేని సగటు ఆటగాడినైనా సరే నిర్మొహమాటంగా జట్టు నుంచి సాగనంపాల్సిందేనని సెలెక్టర్లకు తేల్చి చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శివం దూబే సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడంలో ముందు వరుసలో ఉన్నాడు. భారత జట్టులో కూడా దూబే తన పేలవమైన ఫీల్డింగ్‌తో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

వరుస ఘోర పరాజయాలకు అదే కారణం..

ఈ మధ్యకాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వరుసగా ఘోర పరాజయాలు మూటగట్టుకోవడానికి ఈ నాసిరకం ఫీల్డింగే ప్రధాన కారణం. జింబాబ్వే పర్యటన కంటే ముందు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది. ఆ తర్వాత బలమైన ఇంగ్లాండ్ చేతిలో టీ20ల్లో 4-0, వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడం, అవుట్ ఫీల్డ్‌లో బౌండరీలను ఆపలేకపోవడం లాంటి తప్పిదాలు మన విజయాలను లాగేసుకున్నాయి. కనీస ఫిట్‌నెస్ లేని ఆటగాళ్లను ఇలాగే మోసుకుంటూ పోతే భవిష్యత్తులో జరిగే భారీ టోర్నీల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని క్రికెట్ విశ్లేషకులు సైతం గవాస్కర్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు.

అహంకారం పక్కనపెట్టి స్మార్ట్‌గా ఆడండి..

కేవలం ఫీల్డింగ్ మాత్రమే కాదు, భారత బ్యాటర్ల అనాలోచిత షాట్ల ఎంపిక పట్ల కూడా సన్నీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో బ్యాటర్లు కనీస మ్యాచ్ అవగాహన లేకుండా ఆడారని దుయ్యబట్టాడు. భారీ పరుగుల వేటలో పదే పదే విఫలమవ్వడం వారిలోని అహంకారానికి నిదర్శనమన్నాడు. క్రికెట్ అనేది వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆడే ఆట కాదని, కేవలం బంతి మెరిట్‌ను బట్టి షాట్ ఆడాలని సూచించాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రతి బంతిని బాదాల్సి రావడం కష్టమే అయినా, కొంచెం తెలివిగా వ్యవహరించాలి. ప్రపంచంలో ఏ జట్టులోనూ ఐదుగురు అత్యుత్తమ బౌలర్లు ఉండరు. కనీసం 8 నుంచి 12 ఓవర్ల పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకునే బౌలర్లు కచ్చితంగా ఉంటారు. వాళ్లను మాత్రమే టార్గెట్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాలి. అదే సమయంలో మంచి బౌలర్లను గౌరవిస్తూ ఆచితూచి ఆడాలి. స్మార్ట్ క్రికెట్ ఆడితే ఎలాంటి అగ్రశ్రేణి బౌలింగ్ దళమైనా తలవంచక తప్పదని గవాస్కర్ గట్టిగా క్లాస్ పీకాడు.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

ఆ ఓపిక ఏది కుర్రాళ్లూ..?

వన్డే ఫార్మాట్ గురించి మాట్లాడుతూ ఆటగాళ్లలో ఏమాత్రం ఓపిక నశించిపోవడాన్ని సన్నీ తీవ్రంగా తప్పుబట్టాడు. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా ఎలాంటి నష్టం లేదు. భారీ షాట్లకు వెళ్లే ముందు పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. 380కి పైగా భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు కూడా కాస్త ఓపికతో ఆడితే సునాయాసంగా మ్యాచ్ గెలవొచ్చని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్, రెండో వన్డేలో కేవలం 233 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 388 పరుగుల లక్ష్య ఛేదనలో 39 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 260 పరుగులతో ఎంతో పటిష్టంగా ఉన్నా, చివర్లో అనవసరపు షాట్లతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. అంతకుముందు ఐర్లాండ్ చేతిలో 183, 155 పరుగుల చిన్న లక్ష్యాలను కూడా ఛేదించలేక పూర్తిగా చేతులెత్తేశారు. ఇప్పటికైనా ఆటగాళ్లు తమ లోపాలను సరిదిద్దుకోకపోతే జట్టు మనుగడ కష్టమేనని గవాస్కర్ కుండబద్దలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us