Rohit Sharma: తప్పు చేసావ్ బ్రో.. ఆహ్ 100 కొట్టే కెపాసిటీ నీకే ఉంది! ఇండియన్ మాజీ ఓపెనర్ వైల్డ్ ఫైర్ కామెంట్స్!
భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, ఇది ఊహించని పరిణామమన్నారు. రోహిత్ తర్వాత భారత టెస్ట్ జట్టు నాయకత్వానికి శుభ్మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. బుమ్రా గాయాల భయంతో గిల్నే ప్రధాన ఎంపికగా బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది.

భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్కు గురి చేసింది. మే 7న తన ఇన్స్టాగ్రామ్ ద్వారా టెస్ట్లకు వీడ్కోలు చెబుతూ, ఇకపై వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెహ్వాగ్ మాట్లాడుతూ, రోహిత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ఆసక్తిగా ఉన్నాడని తెలుసని, ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం తాను ఊహించలేదని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా రోహిత్ తన రిటైర్మెంట్ పై స్పష్టత ఇచ్చినట్టే చెప్పలేదని, సెలెక్టర్లతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
సెహ్వాగ్, రోహిత్ కెరీర్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ ప్రారంభించి, టెస్ట్ ఓపెనర్గా అద్భుతంగా మారిపోయిన అతని ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రోహిత్ 100 టెస్టులు ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడని, కానీ ముందుగానే నిష్క్రమించి సరికొత్త అధ్యాయం ప్రారంభించాడని అభిప్రాయపడ్డారు. రోహిత్ శైలీ, అతని బ్యాటింగ్లోని అందం అభిమానులను ఎప్పటికీ మరిచిపోలేనివని ఆయన జోడించారు. అతని రికార్డులు, నాయకత్వంలో వచ్చిన విజయాలు భారత క్రికెట్ను ఒక మలుపు తిప్పాయన్నారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చలు వేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, శుభ్మన్ గిల్ ఈ పదవికి ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో తన నాయకత్వ నైపుణ్యాలు ప్రదర్శించిన గిల్ను బీసీసీఐ పరిశీలిస్తోంది. టెస్ట్ మ్యాచుల్లో ఓపెనర్గా, నంబర్ 3 స్థానంలో అతని స్థిరమైన ప్రదర్శనలు ఈ నిర్ణయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు, జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం భారత వైస్ కెప్టెన్గా ఉన్నా, గాయాల కారణంగా అతనిపై పెద్ద బాధ్యతను వేసే విషయంలో బీసీసీఐ సుముఖంగా లేదు. ఇటీవలే బుమ్రా తీవ్ర వెన్ను గాయంతో బయటికొచ్చిన సంగతి తెలిసిందే, తద్వారా అతని పనిభారాన్ని సర్దుబాటు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి రోహిత్ అనంతరం గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..