IND vs NZ: ‘మీ దృష్టిలో మూడేళ్లు.. నాకు మాత్రం పన్నెండే’ అంటూ మండిపడిన రోహిత్.. ఎందుకో తెలుసా?
Rohit Sharma: న్యూజిలాండ్తో ఇండోర్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో 30వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. అయితే, ఈ సెంచరీ విషయంలో బ్రాడ్కాస్టర్పై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత చాలా కోపంగా కనిపించాడు. మూడేళ్లలో ఇదే తొలి వన్డే సెంచరీ అంటూ వచ్చిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన విషయాలు తెలుసుకోవాలని రోహిత్ బ్రాడ్కాస్టర్ను మందలించాడు. వివిధ కారణాల వల్ల గత మూడేళ్లలో తాను చాలా తక్కువ వన్డేలు ఆడానని, ఈ విషయాలు గుర్తుంచుకొని మాట్లాడాలని రోహిత్ శర్మ సూచించాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ తన 30వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఆ సమయంలో బ్రాడ్కాస్టర్లు జనవరి 2020 తర్వాత ఇది రోహిత్ తొలి సెంచరీ అంటూ ప్రకటించారు. అయితే దీనిపై ఆగ్రహించిన రోహిత్.. ఈ లెక్కలు కరెక్టే కావచ్చు. కానీ అసలు జరిగిన విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటందని హితవు పలికాడు.
బ్రాడ్కాస్టర్పై చిరాకుపడిన రోహిత్..
కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘మూడేళ్లలో ఇది తొలి సెంచరీ అయినప్పటికీ, ఈ కాలంలో నేను 12 వన్డేలు మాత్రమే ఆడాను. ఏం జరుగుతుందో మీరు తప్పక తెలుసుకోవాలి. ఇది ప్రసార సమయంలో చూపించారని నాకు తెలుసు. కానీ, కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బ్రాడ్కాస్టర్ సరైన విషయాన్ని కూడా చూపించాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.




‘హిట్మ్యాన్’ రిటర్న్ ఇదేనా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘2020లో వన్డేలు నిర్వహించలేదు. కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యాం. మేం వన్డేలు ఆడలేదు. నేను కూడా గాయపడ్డాను. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మేం గత సంవత్సరం నుంచి ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్నాం. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన బ్యాట్స్మెన్ కనిపించలేదు. అతను రెండు సెంచరీలు సాధించాడు. మరెవరూ అలా చేయలేదని నేను అనుకుంటున్నాను’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
ర్యాంకింగ్ ముఖ్యం కాదు: రోహిత్
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ను అవుట్ చేయాలని శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీతో కలిసి ఎలా ప్లాన్ చేశామో రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘ఈ ఫార్మాట్లో నైపుణ్యాలను ఉపయోగించాలి. శార్దూల్కు ఆ సత్తా ఉంది. అద్భుతమైన బంతితో టామ్ లాథమ్ను అవుట్ చేశాడు. దీన్ని విరాట్, హార్దిక్, శార్దూల్ కలిసి ప్లాన్ చేశారు’ అంటూ రోహిత్ తెలిపాడు.
సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ను కొనియాడిన కెప్టెన్..
‘ఈ సిరీస్లో గిల్ బ్యాటింగ్ చేసిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను తన ఆటను అర్థం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఫెసిలిటేటర్ పాత్రను పోషించాడు’ అని తెలిపాడు.
ఈ విజయంతో భారత్ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే రోహిత్ మాట్లాడుతూ, ‘నిజాయితీగా చెప్పాలంటే, ర్యాంకింగ్ల గురించి పట్టింపు లేదు. ఈ సిరీస్కు ముందు మనం నాలుగో స్థానంలో ఉన్నాం. కొన్ని సిరీస్లను కోల్పోయి నాలుగో స్థానంలో ఎలా ఉన్నామో తెలియదు. మేం దాని గురించి పెద్దగా ఆలోచించం. ప్రతి సిరీస్తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




