Team India: ఆ తోపును తప్పించడం నా తప్పే.. ప్లేయింగ్ 11 వివాదంపై సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Playing XI Decision: టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో అక్షర్ పటేల్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం తన తప్పేనని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంగీకరించారు. ఆ నిర్ణయం తర్వాత అక్షర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారని, తాను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పినట్టు వెల్లడించారు.

Suryakumar Yadav Axar Patel Controversy: టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో భారత జట్టు తీసుకున్న ఒక కీలక నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను జట్టులోంచి తప్పించారు. ఆ మ్యాచ్లో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యూహాత్మక నిర్ణయం భారత జట్టుకు అనుకూలంగా మారలేదు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ ఓటమి చవిచూసింది. ఇదే టీమిండియాకు టోర్నమెంట్లో వచ్చిన ఏకైక పరాజయం.
“అక్షర్ కోపంగా ఉండటమే సహజం”..
ఈ నిర్ణయంపై తాజాగా స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తప్పును అంగీకరించారు. అక్షర్ పటేల్ ఆ నిర్ణయంతో చాలా కోపంగా ఉన్నారని ఆయన తెలిపాడు. “అతను కోపంగా ఉండటం సహజమే. అతను అనుభవజ్ఞుడైన ఆటగాడు, ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నాడు. అలాంటి ఆటగాడిని తప్పించడం వల్ల అతనికి బాధ కలగడం సహజం” అని సూర్యకుమార్ తెలిపాడు.
అక్షర్కు క్షమాపణ చెప్పిన సూర్యకుమార్..
మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ పటేల్తో మాట్లాడి తన నిర్ణయంపై క్షమాపణ చెప్పానని సూర్యకుమార్ వెల్లడించారు. “నేను అతనికి నా తప్పు అని చెప్పాను. జట్టు ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ అది సరైనది కాలేదు. నేను క్షమాపణ కోరాను. అది కాస్త కఠినమైన సంభాషణ అయినప్పటికీ అక్షర్ చాలా పరిపక్వంగా స్పందించాడు” అని తెలిపాడు.
వరల్డ్ కప్ విజయం అక్షర్కు భావోద్వేగ క్షణం..
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు టైటిల్ గెలవడం అక్షర్ పటేల్కు ఎంతో భావోద్వేగ క్షణంగా మారింది. తన చిన్న కుమారుడు హక్ష్ స్టేడియంలో ఉండి తన ఆటను తొలిసారి చూశాడని అక్షర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి వరల్డ్ కప్ గెలవడం తన కల అని, ఆ రోజు తన జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు.
ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం..
అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ వేగవంతమైన అర్ధశతకం, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్తో జట్టు భారీ స్కోరు సాధించింది. తర్వాత బౌలింగ్లో అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను 159 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



