Team India: పిచ్చెక్కిపోతోంది.! ఈ జన్మలో టీమిండియా మాదిరి ఒక్కరోజైనా పాక్ జట్టు ఆడుతుందా..
2026 టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించగా, పాకిస్తాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ విజయాలను, కృషిని ప్రశంసించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరు, ఆటగాళ్ల కాంట్రాక్టుల పారదర్శకత లేకపోవడంపై విమర్శలు గుప్పించారు.

2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా, మొత్తంగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆతిథ్యం ఇచ్చిన దేశంగా ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ నిలిచింది. 2024 ఐసీసి టీ20 ప్రపంచకప్, 2025 ఐసీసి ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్లలో భారత్ వరుస విజయాలు సాధించడం విశేషం.
ఒకవైపు భారత్ విజయ పరంపర కొనసాగుతుంటే, మరోవైపు పాకిస్తాన్ జట్టు 2026 టీ20 ప్రపంచకప్లో ఘోరంగా విఫలమైంది. సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలాగే ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీసుకున్న నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిబి పనితీరుపై ఆయన మండిపడ్డారు. భారత్, పాకిస్తాన్ జట్ల ప్రదర్శనలను పోలుస్తూ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ట్రోఫీలు గెలవడం భారత్ డిఎన్ఏలోనే ఉంది. మా పాకిస్తాన్ డిఎన్ఏలో మాత్రం నాకౌట్ దశకు ముందు ఓడిపోవడం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. భారత జట్టు సాధిస్తున్న వరుస విజయాలు, ఐసీసి టోర్నీలలో వారి అద్భుత ప్రదర్శన ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదని లతీఫ్ ప్రశంసించారు. దాదాపు 10 ఏళ్ల కష్టానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టాస్ ఓడినా 250కి పైగా పరుగులు సాధించి, ఆ తర్వాత వారిని అడ్డుకుని ఓడించడం అంత సులువైన పని కాదని, ఇది వారి ఏళ్ల తరబడి కృషి ఫలితమని అన్నారు. ఇటీవలే జరిగిన ఐసీసి టోర్నీలు, ఆసియా కప్లను పరిశీలిస్తే భారత్ స్థాయి అర్థమవుతుందని లతీఫ్ తీవ్ర స్థాయిలో టీమిండియాను కొనియాడారు.
పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలోని లోపాలపై కూడా లతీఫ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలో వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపించారు. బలహీనమైన బోర్డులు ఇలాగే వ్యవహరిస్తాయని, కాంట్రాక్టులలో జరిమానాలు, బహుమతులు అన్నీ స్పష్టంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పిసిబి తీవ్రంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రషీద్ లతీఫ్ వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితిని, భారత క్రికెట్ సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..
