చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
2010లో రెండు పిజ్జాల కోసం చెల్లించిన 10,000 బిట్కాయిన్లు నేడు రూ.7,400 కోట్లకు పైగా విలువ చేస్తుండటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. లాస్లో హన్యెజ్ చేసిన ఈ లావాదేవీతోనే బిట్కాయిన్ తొలిసారి నిజమైన కరెన్సీగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం మే 22ను “బిట్కాయిన్ పిజ్జా డే”గా జరుపుకుంటూ క్రిప్టో ప్రపంచం ఈ చారిత్రాత్మక ఘటనను గుర్తుచేసుకుంటోంది.
ప్రతి జీవి జీవితం ఆకలి పోరాటంతోనే మొదలవుతుంది. భూమిపైనున్న ప్రతి జీవి కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి నిద్రపోయే వరకూ ప్రతి మనిషీ తాను, తన కుటుంబం ఆకలి తీర్చేందుకు శ్రమిస్తూనే ఉంటాడు. అంటే ఈ ఆకలి ఎంత శక్తివంతమైనదో అర్ధమవుతుంది. అలాంటి ఆకలి ఒక ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఓ వ్యక్తి తన ఆకలి తీర్చుకోవడం కోసం చేసిన చిన్న ప్రయోగం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత ఖరీదైన లావాదేవీగా నిలిచింది. 2010 మే నెలలో ఫ్లోరిడాకు చెందిన లాస్లో హన్యెజ్ ఇంటర్నెట్ ఫోరమ్లో ఒక ఆఫర్ ఇచ్చారు. తనకు రెండు పెద్ద పాపా జాన్స్ పిజ్జాలు ఆర్డర్ చేసి పంపిస్తే, 10,000 బిట్కాయిన్లు ఇస్తానని ప్రకటించారు. దీనికి స్పందించిన.. జెరెమీ స్టెర్డివెంట్ అనే మరో యూజర్ 25 డాలర్లు ఖర్చుతో లాస్లో కోరిన పిజ్జాలను చిరునామాకు పంపించారు. వెంటనే లాస్లో 10 వేల బిట్ కాయిన్స్ ను ఆయనకు పంపారు. అలా చరిత్రలో తొలిసారి.. బిట్కాయిన్ ద్వారా లావాదేవీ జరిగింది. దీనికి గుర్తుగా ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ప్రియులు “బిట్కాయిన్ పిజ్జా డే” ను ఘనంగా జరుపుకుంటారు. అయితే.. నాటి 10 వేల బిట్ కాయిన్ల ధర.. నేటి మార్కెట్లో ఏకంగా రూ. 7,400 కోట్లకు పైమాటే. ఈ సందర్భంగా అందరూ నాటి పిజ్జాల కొనుగోలు ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. ఈ లావాదేవీ కేవలం ఒక మీమ్ కాదు, కేవలం ఇంటర్నెట్ కోడ్గా ఉన్న బిట్కాయిన్ను నిజ ప్రపంచ కరెన్సీగా మార్చిన చారిత్రాత్మక ఘట్టం. ఎలాంటి బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకంతో జరిగిన ఈ వ్యాపారమే, నేటి ట్రిలియన్ డాలర్ల క్రిప్టో పరిశ్రమకు పునాది వేసింది. 16 ఏళ్ల ఈ ప్రస్థానంలో బిట్కాయిన్ ‘డిజిటల్ బంగారం’గా ఎదిగింది. అమెరికాలో స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ల ఆమోదంతో వాల్స్ట్రీట్ దిగ్గజాలు, ప్రభుత్వాలు సైతం దీని వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్లోనూ దీని క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోని మొత్తం బిట్కాయిన్లలో దాదాపు 5% భారతీయ ఇన్వెస్టర్ల వద్దే ఉన్నట్లు అంచనా. ఒకప్పుడు కేవలం ట్రేడర్లకే పరిమితమైన క్రిప్టో, ఇప్పుడు యువ ఉద్యోగులకు దీర్ఘకాలిక పెట్టుబడి ఆప్షన్గా మారింది. అయితే, బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ రిస్క్తో కూడుకున్నదే. గతంలో ఇది ఎన్నోసార్లు కుప్పకూలింది. అయినప్పటికీ ప్రతిసారీ పుంజుకుంది. అందుకే నిపుణులు పూర్తి అవగాహనతో తమ పోర్ట్ఫోలియోలో చిన్న భాగంగా మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఆకలితో ఉన్న ఒక ప్రోగ్రామర్ ఇంటర్నెట్ డబ్బుతో భోజనం కొనడం, తెలియకుండానే ఆర్థిక చరిత్రను మార్చడం.. టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చగలదో చెప్పడానికి ఈ పిజ్జా కథే ఒక నిదర్శనం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్ వెహికిల్కు క్షణాల్లో ఛార్జింగ్.!
రూ. లక్ష క్యాష్ బ్యాగ్ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

