ODI World Cup 2027: ఆ ముగ్గురి దెబ్బకు అభి’షేకింగ్’.. వన్డే ప్రపంచకప్ నుంచి గెంటేశారుగా..?
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానం కోసం యువ సంచలనం అభిషేక్ శర్మతో పాటు మరో ముగ్గురు కీలక ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిలో తుది జట్టులో చోటు దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో అన్నది ఆసక్తికరంగా మారింది.

2027 వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే 20 మంది సమర్థులైన ఆటగాళ్లను గుర్తించినట్లు సమాచారం. ఈ జాబితా నుంచే తుది 15 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రధాన ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయ ఓపెనర్ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి వేగవంతమైన పిచ్లపై ఇతని ఆట తీరు జట్టుకు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, వన్డే ఫార్మాట్లో ఇప్పటికే తన ముద్ర వేసిన యశస్వి జైస్వాల్ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. జైస్వాల్ ఇప్పటివరకు ఆడిన వన్డేల్లో 57 సగటుతో పరుగులు సాధించి సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. జైస్వాల్ను కాదని అభిషేక్ శర్మకు అవకాశం దక్కడం అంత సులభం కాకపోవచ్చు.
ఓపెనింగ్ రేసులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇషాన్ కిషన్ కేవలం ఓపెనర్గానే కాకుండా, రిజర్వ్ వికెట్ కీపర్గా కూడా జట్టుకు ఉపయోగపడతాడు. గతంలో బంగ్లాదేశ్పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డు ఇతని సొంతం. 24 వన్డే ఇన్నింగ్స్లలో 42 సగటుతో 933 పరుగులు చేసిన ఇషాన్, 102 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగలడు. ఈ బహుముఖ ప్రజ్ఞ ఇషాన్ను రేసులో ముందుంచుతోంది.
చివరికి యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుంటే ఇషాన్ కిషన్కు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే జైస్వాల్ లేదా అభిషేక్ శర్మలకు ప్రాధాన్యత దక్కవచ్చు. రాబోయే సిరీస్లలో వీరి ప్రదర్శన ఆధారంగానే ప్రపంచకప్ బెర్త్ ఖరారు కానుంది.
పొట్టి ఫార్మాట్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఇంకా వన్డేల్లో ఆకట్టుకోలేదు. ఒకవేళ వన్డే జట్టులో స్థానం దక్కించుకుని బాగా రాణిస్తే, వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో నిలకడగా చోటు దక్కించుకోవచ్చు. ఏది ఏమైనా 2027 ప్రపంచకప్ లోపు బీసీసీఐ ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




