IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్ల్లో భారత్, పాక్ ఢీ.. ప్రపంచకప్ ఫార్మాట్ మార్చేసిన ఐసీసీ?
ICC New Format ODI World Cup 2027: రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయిన తరుణంలో, ఐసీసీ టోర్నీలే అభిమానులకు ఏకైక దిక్కుగా మారాయి. ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త 'సూపర్ 7' వినూత్న ఫార్మాట్ 2027 ప్రపంచకప్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించేలా దోహదపడనుంది.

India vs Pakistan 2027 World Cup: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్-పాకిస్తాన్ సమరానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రీడాభిమానులకు ఊహించని తీపి కబురు అందించింది. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫార్మాట్లో ఐసీసీ చారిత్రాత్మక మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, ఈ మెగా టోర్నీలో దాయాదుల పోరు ఏకంగా మూడుసార్లు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
బ్రాడ్కాస్టర్ల ఒత్తిడి.. ఫార్మాట్ మార్పునకు కారణమిదే..!
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ జరగనుంది. గత రెండు ప్రపంచకప్ టోర్నీలలో కేవలం పది జట్లు మాత్రమే పాల్గొనడం వల్ల రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించారు. అందువల్ల భారత్, పాకిస్తాన్ జట్లు లీగ్ దశలో కేవలం ఒకే ఒక్కసారి తలపడే అవకాశం ఉండేది. ఒకవేళ పాకిస్తాన్ నాకౌట్ చేరకపోతే రెండో మ్యాచ్కు ఆస్కారమే ఉండేది కాదు. గత రెండు టోర్నీల్లోనూ పాకిస్తాన్ లీగ్ దశలోనే వెనుదిరగడంతో ఐసీసీతో పాటు అధికారిక ప్రసారదారులు (బ్రాడ్కాస్టర్లు) భారీగా ఆదాయాన్ని నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ వార్షిక సమావేశంలో టోర్నీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు.
మూడుసార్లు తలపడే సమీకరణాలు ఇవే..
కొత్త ఫార్మాట్ ప్రకారం.. ప్రధాన రౌండ్లో మొత్తం పన్నెండు జట్లను ఆరు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. వ్యాపార ప్రకటనలు, ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ ఖచ్చితంగా భారత్, పాకిస్తాన్లను ఒకే గ్రూపులో ఉంచుతుంది. దీనివల్ల మొదటి రౌండ్లోనే ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ 7’ రౌండ్కు అర్హత సాధిస్తాయి. ఈ రౌండ్ కూడా రౌండ్ రాబిన్ పద్ధతిలోనే సాగుతుంది కాబట్టి, ఇక్కడ భారత్-పాక్ మధ్య రెండో మ్యాచ్ జరగడం ఖాయం. ఆపై సూపర్ 7లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. అక్కడ పాయింట్ల పట్టిక ఆధారంగా లేదా ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడితే మూడో మ్యాచ్ ఆవిష్కృతమవుతుంది.
సోషల్ మీడియాలో విమర్శల వరద..
ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కేవలం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ల ద్వారా వచ్చే భారీ ఆదాయం కోసమే ఐసీసీ నిబంధనలను ఇంతగా మార్చిందని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు. ఆట కంటే వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మైదానంలో దాయాదుల పోరును పదే పదే చూడాలనుకునే సగటు క్రికెట్ ప్రేమికుడికి మాత్రం ఇది నిజంగా పండగ లాంటి వార్త అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




