IND vs SA : రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ.. సౌతాఫ్రికా-ఏపై తొలి అనధికారిక వన్డేలో భారత్-ఏ ఘన విజయం!
రాజ్కోట్లో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఇండియా-ఏ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లతో పాటు హర్షిత్ రాణా మెరుపు దాడికి దిగారు. అర్ష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరంభపు స్పెల్స్ కారణంగా సఫారీ జట్టు కేవలం 1 పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

IND vs SA : సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. రాజ్కోట్లో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బౌలర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా మెరుపు దాడి చేసి సఫారీ జట్టుకు కోలుకోలేని దెబ్బ తీయగా, ఆ తర్వాత బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ (117 పరుగులు) చేసి భారత విజయాన్ని ఖరారు చేశాడు.
రాజ్కోట్లో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఇండియా-ఏ బౌలర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లతో పాటు హర్షిత్ రాణా మెరుపు దాడికి దిగారు. అర్ష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరంభపు స్పెల్స్ కారణంగా సఫారీ జట్టు కేవలం 1 పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 16 పరుగులకే నాలుగో వికెట్, 53 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో డియాన్ ఫారెస్టర్ (77 పరుగులు), డెలానో పోట్గెటర్ (Delano Potgieter) కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో పోట్గెటర్ 90 పరుగులు చేయగా, బిజోర్న్ ఫార్టూయిన్ 59 పరుగులు జోడించి స్కోర్ను 285 పరుగులకు చేర్చడంలో ముఖ్యపాత్ర వహించారు. 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ (31), రియాన్ పరాగ్ (8) పెద్ద స్కోర్లు చేయకుండానే అవుటయ్యారు. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్ను నడిపించాడు.
గైక్వాడ్ యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గైక్వాడ్ అద్భుతంగా ఆడి 117 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని సెంచరీ భారత జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేసింది. చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
ఒత్తిడిలో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 26 బంతుల్లో 37 పరుగులు చేసి, నిశాంత్ సింధుతో కలిసి 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సింధు చివరి వరకు క్రీజులో నిలిచి 29 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక వన్డే మ్యాచ్ నవంబర్ 16న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




