Gautam Gambhir : వరల్డ్ కప్ కొట్టాం.. ఇక ఒలింపిక్ గోల్డ్ మెడలే టార్గెట్.. గంభీర్ మాస్టర్ ప్లాన్ రెడీ
Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీమిండియాను కేవలం ఐసీసీ ట్రోఫీలకు మాత్రమే పరిమితం చేయకుండా, 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని అందించడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీమిండియాను కేవలం ఐసీసీ ట్రోఫీలకు మాత్రమే పరిమితం చేయకుండా, 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని అందించడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత్కు టీ20 ప్రపంచకప్ 2026 అందించి ఊపుమీదున్న గంభీర్, ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక గొప్ప గౌరవమని, ఆ ప్రయాణంలో తాను భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. క్రికెట్ తిరిగి ఒలింపిక్స్లోకి వస్తున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒలింపిక్ స్వర్ణం గెలవడం గురించి గంభీర్ మాట్లాడుతూ.. “ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఒకవేళ ఆ ప్రయాణంలో టీమిండియాకు మార్గనిర్దేశం చేసే అవకాశం నాకు వస్తే, అది నా అదృష్టంగా భావిస్తాను. కచ్చితంగా ఆ బాధ్యతను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. కోచ్గా తన పాత్ర కేవలం ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడమేనని, మైదానంలో గెలుపు అనేది కేవలం ఆటగాళ్ల కృషి వల్లే సాధ్యమవుతుందని ఆయన తన టీమ్ ఫస్ట్ దృక్పథాన్ని చాటుకున్నారు. సపోర్ట్ స్టాఫ్ నుంచి లాజిస్టిక్స్ టీమ్ దాకా అందరి సహకారం ఉంటేనే విజయం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
మీడియా తీరుపై కూడా గంభీర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేవలం సోషల్ మీడియా క్లిక్కుల కోసం, నంబర్ల కోసం ఆటగాళ్లను అన్ రేటెడ్ (తక్కువ అంచనా వేయబడిన) లేదా ఓవర్ రేటెడ్ (ఎక్కువ అంచనా వేయబడిన) అని ముద్ర వేయడం ఆపాలని ఆయన కోరారు. ప్రతి ఆటగాడు తన జట్టు విజయం కోసం కష్టపడుతున్నారని, వారి విలువను తగ్గించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేవలం గెలుపు ఓటముల మీద దృష్టి పెట్టడం కంటే, ఒక ప్రత్యేకమైన శైలిలో క్రికెట్ ఆడటంపై తాము దృష్టి సారిస్తున్నామని, ఆట తీరు బాగుంటే ఫలితాలు అవే వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం గంభీర్ సారథ్యంలో టీమిండియా దూకుడుగా కనిపిస్తోంది. 2028 ఒలింపిక్స్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఒలింపిక్ పతకం అనేది భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలవనుంది. గంభీర్ కోరుకున్నట్లుగా భారత్ లాస్ ఏంజిల్స్లో స్వర్ణం సాధిస్తే, అది భారత క్రీడారంగంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
