AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఢిల్లీ కెప్టెన్ రేసులో ఆ ముగ్గురు.. కానీ పట్టాభిషేకం మాత్రం అతనికే అంటున్న భారత మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్‌లలో ఎవరు ఎంపిక అవుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. అక్షర్ పటేల్ భారత వైస్ కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో అతనికి ఎక్కువ అవకాశం ఉండొచ్చని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. మరోవైపు, RCB కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. ఈ కీలక మార్పులు ఐపీఎల్ 2025లో ఏ విధంగా ప్రభావం చూపుతాయో చూడాలి-

IPL 2025: ఢిల్లీ కెప్టెన్ రేసులో ఆ ముగ్గురు.. కానీ పట్టాభిషేకం మాత్రం అతనికే అంటున్న భారత మాజీ క్రికెటర్
Axar Patel Kl Rahul
Narsimha
|

Updated on: Feb 16, 2025 | 11:43 AM

Share

2025 ఐపీఎల్ సీజన్‌కు ముందుగా, ఢిల్లీ క్యాపిటల్స్ తన కొత్త కెప్టెన్సీ ఎంపికపై దృష్టి పెట్టింది. భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన విశ్లేషణలో మూడు ప్రధాన పేర్లను సూచించారు. వాళ్లలో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నారు. అయితే, తన అభిప్రాయంలో అక్షర్ పటేల్ కెప్టెన్సీకి ముందువరుసలో ఉన్నారని పేర్కొన్నారు.

2024 సీజన్‌లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 7.65 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీయడమే కాకుండా, 131.28 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు కూడా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 16.50 కోట్లకు రిటైన్ చేయడం అతని సామర్థ్యాలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్, వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక భూమిక పోషించనున్నాడు. ఈ అనుభవం అతని నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు తీసుకుంది. అతని గత కెప్టెన్సీ అనుభవం కూడా గమనించదగినది. ఇండియా, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు నాయకత్వం వహించిన అతను, రెండు సీజన్లలో తన జట్టును ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లాడు. సుదీర్ఘ అనుభవం, స్థిరమైన ఆటతీరు కలిగిన రాహుల్, ఢిల్లీ జట్టును విజయపథంలో నడిపించగలడని అనుకోవచ్చు.

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ 2 కోట్లకు కొనుగోలు చేసింది. అతని అనుభవం, ముఖ్యంగా ఆర్‌సిబి కెప్టెన్‌గా గత సీజన్లలో చేసిన అద్భుతమైన పనితీరు, అతన్ని కెప్టెన్సీకి గట్టి పోటీదారుగా మారుస్తుంది. అయినప్పటికీ, ఢిల్లీ ఫ్రాంచైజీ అక్షర్ లేదా రాహుల్ వైపే మొగ్గు చూపుతుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.

RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్:

ఐపీఎల్ 2025లో మరో ప్రధాన మార్పుగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ప్రకటించడం సంచలనంగా మారింది. విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్ అవుతారనే అంచనాలు ఉండగా, ఫ్రాంచైజీ ఆశ్చర్యకరంగా పాటిదార్‌ను నాయకుడిగా ఎంపిక చేసింది. RCBకు ఇంతకుముందు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కెవిన్ పీటర్సన్, డేనియల్ వెట్టోరి, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, కోహ్లీ లాంటి దిగ్గజాలు నాయకత్వం వహించారు.

RCB ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేకపోయినా, ఒక పోటీతత్వ జట్టుగా కొనసాగుతోంది. “ఫ్రాంచైజీ విజయాన్ని కేవలం ట్రోఫీల ఆధారంగా నిర్ణయించలేం. ఇది ట్రోఫీ లేకపోయినప్పటికీ విజయవంతమైన ఫ్రాంచైజీ,” అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించారు. కోహ్లీ నాయకత్వంలో అత్యధిక కాలం గడిపిన RCB, పాటిదార్‌తో కొత్త ప్రయోగం చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..