Delhi Capitals : ఒక్కోసారి అంతే సామీ.. ఓటమి తర్వాత మీడియా ముందు అక్షర్ పటేల్ సాహసోపేత నిర్ణయం
Delhi Capitals : ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించారు. పంజాబ్ చేతిలో ఓటమి ప్రభావం తమపై ఉందని, తదుపరి మ్యాచ్ల్లో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఓటమి ఎదురైనా టీమ్లో పెద్దగా మార్పులు ఉండవని కెప్టెన్ తెలిపారు.

Delhi Capitals : ఆర్సీబీ చేతిలో ఎదురైన ఘోర పరాభవంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నోరు విప్పారు. మైదానంలో జట్టు ప్రదర్శన ఎంత దారుణంగా ఉన్నా, కెప్టెన్గా బాధ్యత తీసుకుంటూ మీడియా ముందుకు వచ్చిన అక్షర్.. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. ఒక పక్క పవర్ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయిన అవమానం, మరోపక్క వరుస ఓటముల బాధ.. వీటన్నింటిపై అక్షర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఆర్సీబీతో జరిగిన మ్యాచులో కేవలం 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పరిస్థితిని చూసి ఆ టీం అభిమానులు షాక్కు గురయ్యారు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. “కెప్టెన్గా జట్టును, సపోర్ట్ స్టాఫ్ను, యజమానులను ఉత్సాహపరచాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇలాంటి ఘోరమైన ఓటమి తర్వాత అందరినీ మానసికంగా సిద్ధం చేయడం నా కర్తవ్యం. ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఒక జట్టుగా మేము కలిసి పోరాడతాం” అని క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీ బ్యాటింగ్ ఇంతలా కుప్పకూలడానికి గల కారణాన్ని కూడా అక్షర్ విశ్లేషించారు. “పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో మేము 264 పరుగులు చేసినా ఓడిపోయాం. ఆ ప్రభావం ఇంకా ఆటగాళ్ల మనసుల్లో ఉంది. అంత పెద్ద స్కోరును కూడా డిఫెండ్ చేసుకోలేకపోయామన్న బాధలో బ్యాటర్లు తడబడ్డారు. కేవలం 15-16 బంతుల్లోనే 6 వికెట్లు కోల్పోవడం అనేది దురదృష్టం తప్ప మరొకటైతే కాదు. ఆటగాళ్లలో ఒక విధమైన ఆందోళన కనిపించింది” అని అక్షర్ పేర్కొన్నారు.
చరిత్రలో అత్యంత తక్కువ పవర్ప్లే స్కోరు నమోదు చేసిన నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు ఉంటాయా? అన్న ప్రశ్నకు అక్షర్ బదులిస్తూ.. “ఎక్కువ మార్పులు చేస్తే ఆశించిన ఫలితాలు రావు. టీమ్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం. మేము ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోలేదు. తదుపరి మ్యాచ్లపై దృష్టి పెట్టి గెలుపు బాట పడతాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఒత్తిడి ఉంటుందని, దానిని అధిగమించి ముందుకు సాగడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
