AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Shivaratri: శ్రావణ శివరాత్రి 4ప్రహరాల పూజా విధానం ఇదే.. మహాదేవుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి!

Shravana Shivaratri 2026: శ్రావణ శివరాత్రి శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున నాలుగు ప్రహరాల్లో శివుడిని ఎలా పూజించాలి? ఏ అభిషేకాలు చేయాలి? ఏ మంత్రాలు జపించాలి? శ్రావణ శివరాత్రి రాత్రికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందో తెలుసుకోండి.

Shravana Shivaratri: శ్రావణ శివరాత్రి 4ప్రహరాల పూజా విధానం ఇదే.. మహాదేవుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి!
Shravana Shivaratri 2026
Rajashekher G
|

Updated on: Aug 13, 2026 | 1:47 PM

Share

Shravana Shivaratri Puja Vidhi Telugu: శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిని శ్రావణ శివరాత్రిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శివ భక్తులకు ఈ రోజు ఎంతో విశిష్టమైనది. మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఈ రాత్రి అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ శివరాత్రి రాత్రి సాధారణ రాత్రి కాదు. ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధించడం, జాగరణ చేయడం, మంత్రజపం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా రాత్రినినాలుగు ప్రహరాలుగా విభజించి శివలింగానికి అభిషేకం, పూజలు నిర్వహించడం విశేష ఫలితాలను ఇస్తుందని శైవ సంప్రదాయంలో చెబుతారు.

నాలుగు ప్రహరాల్లో శివుడిని ఎలా పూజించాలి?

మొదటి ప్రహరం: సాయంత్రం నుంచి రాత్రి వరకు

సూర్యాస్తమయం తర్వాత మొదటి ప్రహరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భక్తులు ముందుగా శివుడిని ధ్యానించి, పూజను సంకల్పంతో ప్రారంభిస్తారు. అనంతరం శివలింగానికి శుభ్రమైన నీటితో అభిషేకం చేయాలి. తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో పంచామృతాభిషేకం నిర్వహించవచ్చు. అనంతరం మరోసారి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి, బిల్వపత్రాలు, పుష్పాలు, ధతూర పుష్పాలు లేదా ఫలాలను సమర్పిస్తారు. ఈ ప్రహరంలో కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, సంతోషం, జీవితంలో సానుకూలత కోసం మహాదేవుడిని ప్రార్థించడం ఆనవాయితీగా ఉంది.

రెండో ప్రహరం: రాత్రి సమయంలో

రెండో ప్రహరంలో శివలింగానికి నీరు, పాలు సమర్పించి అభిషేకం చేస్తారు. అనంతరం బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించి శివుడికి హారతి ఇస్తారు. ఈ సమయంలో మహామృత్యుంజయ మంత్రం, పంచాక్షరి మంత్రం “ఓం నమః శివాయ” వంటి శివ మంత్రాలను జపించడం భక్తులు శుభప్రదంగా భావిస్తారు. శివారాధన వల్ల భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మూడో ప్రహరం: అర్ధరాత్రి

శివరాత్రి పూజలో మూడో ప్రహరానికి అత్యంత ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఇది సాధారణంగా అర్ధరాత్రి సమయానికి వస్తుంది. ఈ సమయంలో శివలింగానికి నీరు, పాలు, తేనె తదితరాలతో అభిషేకం చేసి, బిల్వపత్రాలను సమర్పిస్తారు. అనంతరం శివునికి సంబంధించిన మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో మహాదేవుడిని ఆరాధించడం వల్ల ఆయన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని మత విశ్వాసం. అందుకే చాలామంది భక్తులు ఈ ప్రహరంలో ప్రత్యేక పూజలు చేసి జాగరణ చేస్తారు.

నాలుగో ప్రహరం: రాత్రి చివరి భాగంలో

నాలుగో ప్రహరం రాత్రి చివరి సమయంలో వస్తుంది. ఈ సమయంలో మరోసారి శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వపత్రాలు, పుష్పాలు, పండ్లు తదితర పూజా సామగ్రిని సమర్పిస్తారు. అనంతరం హారతి ఇచ్చి శివుడిని ప్రార్థిస్తారు. రాత్రంతా ఉపవాసం, జాగరణ చేసిన భక్తులు నాలుగో ప్రహరం పూజ అనంతరం తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం నెలకొనాలని మహాదేవుడిని ప్రార్థిస్తారు.

శ్రావణ శివరాత్రి ఎందుకు ప్రత్యేకం?

శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. అందులోనూ శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేస్తూ నాలుగు ప్రహరాల్లో శివుడిని పూజించడం విశేషమైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణిస్తారు. భక్తి, నియమం, ఉపవాసం, మంత్రజపం, అభిషేకం ద్వారా మహాదేవుడి కృపను పొందవచ్చని భక్తుల విశ్వాసం. అయితే, ప్రహరాల ఖచ్చిత సమయాలు ప్రాంతం, సూర్యాస్తమయం, స్థానిక పంచాంగాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి పూజా సమయాల కోసం మీ ప్రాంతీయ పంచాంగాన్ని అనుసరించడం మంచిది.

(Disclaimer: ఈ కథనంలోని పూజా విధానాలు, ఆచారాలు మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రాంతీయ పంచాంగాలు, ఆచారాల్లో స్వల్పంగా తేడాలు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us