Vasantha Panchami: బాసరలో వసంత పంచమి శోభ.. భక్తులకు చదువుల తల్లి అద్భుత దర్శనం
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం రెండు గంటలకు మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం రెండు గంటలకు మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి దంపతులకు బాసర ఆలయ ప్రధాన అర్చకులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ ఉన్నారు. అమ్మవారి పుట్టిన రోజైన వసంత పంచమి వేళ అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి విద్యాబుద్ధులు అలవరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఫలితంగా నేడు అక్షరాభ్యాసాలు చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. అక్షర శ్రీకార మండపంలో ఉదయం నాలుగు గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. నేటి సాయంత్రం అమ్మవారికి మహా చతు షష్ఠి పూజ, చండీహోమం, మహా మంగళ హారతి, మంత్రపుష్పం వేదోపచారాలతో పూజ కార్యక్రమాలు ముగుస్తాయి.
సకల కళలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడా లేకుండా భక్తులందరూ పుస్తకాలు, పెన్నులను అమ్మవారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. జ్ఞానప్రాప్తి కోసం జ్ఞానసరస్వతి దేవిని ఆరాధించాలని బ్రహ్మవైవర్తపురాణంలో ఉంది. శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునికి విష్ణుమూర్తి వివరించినట్లు దేవీ భాగవతం చెబుతోంది. మాఘమాసం శిశిర ఋతువులో సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. బాసర సరస్వతి కరుణతో చిన్నారులు సద్బుద్ధిని పొందుతారని భావిస్తారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు.
నరేష్ స్వేన, ఉమ్మడి ఆదిలాబాద్, టీవీ9 తెలుగు
ఇవీ చదవండి.
Statue Of Equality: ముచ్చింతలకు మోదీ.. అరేంజ్మెంట్స్ అదుర్స్.. లైవ్ వీడియో
Bigg Boss OTT: బిగ్బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..