AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగరంగవైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీరామనగరంలో అంబరాన్నంటిన సంబురాలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంతో పాటు మైహోమ్‌ భూజ, మైహోమ్‌ హబ్‌, మైహోమ్‌ త్రిదశలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి

అంగరంగవైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీరామనగరంలో అంబరాన్నంటిన సంబురాలు
Vaikuntha Ekadashi Celebrations
Balaraju Goud
|

Updated on: Jan 10, 2025 | 7:08 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంతో పాటు మైహోమ్‌ భూజ, మైహోమ్‌ హబ్‌, మైహోమ్‌ త్రిదశలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. గోవిందుడి సేవలో భక్తులు తరించారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరం జైశ్రీమన్నారాయణ నామ స్మరణతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ దివ్య సాకేత శ్రీరామ చంద్ర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు ఉత్తర ద్వార దర్శనాలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన శ్రీ రంగనాథ స్వామిని.. ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీదివ్య సాకేత రామచంద్రస్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.

ముచ్చింతల్‌లోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జూపల్లి రామేశ్వరరావుతో పాటు వినోద్‌ రావు, జూపల్లి రామురావు, జూపల్లి రంజిత్‌ రావు కుటుంబ సమేతంగా ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.

అటు హైదరాబాద్ హైటెక్ సిటీ మై హోమ్ హబ్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మత్స్యకూర్మావతార శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీలక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నారు భక్తులు. మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలిగిపోయి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నామని డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు అన్నారు .

హైదరాబాద్‌ మైహోమ్ భూజ ఇల వైకుంఠాన్ని తలపించింది. మైహోమ్ భూజలోని దేవాలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి సెట్టింగ్ వేసి.. భక్తులకు ఆ దేవదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న దిగివచ్చినట్లుగా కనిపిస్తోన్న స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తులు. మైహోమ్ భూజలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు మైహోమ్ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. హైదరాబాద్‌ మై హోమ్ త్రిదశలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..