Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు..

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పాంచ నరసింహుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తగణం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న స్వామి వారి తిరు కళ్యాణం నేడు జరగనుంది. ఇందుకోసం దేవస్థానం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

Telangana: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు..
Yadagiri Temple
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 18, 2024 | 3:19 PM

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పాంచ నరసింహుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తగణం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న స్వామి వారి తిరు కళ్యాణం నేడు జరగనుంది. ఇందుకోసం దేవస్థానం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

రాత్రి 8.45 గంటలకు తిరుప కళ్యాణం..

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు రాత్రి విశేష ఘట్టమైన శ్రీస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో జరగనుంది. రాత్రి 8:45 అభిజిత్ లగ్నం ముహూర్తాన స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా ప్రారంభం కానుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళ వాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేయనున్నారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రానున్నారు. పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనయ్యే ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు.

తిరు కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు..

ఆలయఉత్తర మాఢ వీధిలో భారీ కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఫైబర్ సెట్టింగ్ లతో పంచ తల రాజగోపురాల మాదిరిగా స్వర్ణమయంలా కనిపించేలా కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. వేదికపై కల్యాణ మూర్తులు, ఆచార్యులు కూర్చునేలా అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపాన్ని మండపాన్ని విద్యుత్ దీపాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. శ్రీస్వామి వారి ఆలయాన్ని పూల తోరణాలు, విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలతో తీర్చిదిద్దుతున్నారు. కల్యాణోత్సవాన్ని భక్తులంతా తిలకించే విధంగా 7 ఎల్ఎస్ఈడీ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సాయంకాలం 4గంటల నుంచి యాదగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసీ. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి వారి తిరి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రి కొండకు రానున్నారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి ఇతర సదుపాయాలను కల్పించినట్లు భాస్కరరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..