Lord Venkateswara: ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు.. భక్తులకు స్వామివారి సేవలు చూసే అవకాశం
ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నామని పేర్కొన్నారు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను జరపనున్నామని చెప్పారు. ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నామని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు.
వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని చెప్పారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి శీవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని సుబ్బారెడ్డి కోరారు. ఇదే నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కార్తీక మాసంలో దీపోత్సవం:
శివకేశవులకు అత్యంత ఇష్టమైన పవిత్రమైన కార్తీక మాసంలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని వివరించారు. అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందని, త్వరలో భూమిపూజ చేస్తామని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..