AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్కెలు తీర్చే ‘అల్లు బండ’.. ఈ అద్భుత ఆలయాన్ని దర్శించాల్సిందే.. ఎక్కడ ఉందంటే..?

Jagtial Lakshmi Narasimha Swamy Temple: జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 300 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడి "అల్లు బండను" తాకితే కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక ఉత్సవాలతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ మహిమలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.

కోర్కెలు తీర్చే ‘అల్లు బండ’.. ఈ అద్భుత ఆలయాన్ని దర్శించాల్సిందే.. ఎక్కడ ఉందంటే..?
Lakshmi Narasimha Swamy Temple
Rajashekher G
|

Updated on: Feb 19, 2026 | 1:57 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం, అద్భుత చరిత్ర కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ధర్మపురిలోని శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల కోవలోనే, జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి, అర్చకుల ఆరు తరాల సేవలు నిదర్శనం. ఈ ఆలయం వెలసిన విధానం గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. విలాసాగరం నుండి కొడిమ్యాల గుట్ట ప్రాంతానికి కట్టెలు కొట్టడానికి వచ్చిన అన్నదమ్ములు లక్ష్మణాచార్యులు, నరసింహాచార్యులు ఒక పెద్ద పరుపు బండపై విశ్రాంతి తీసుకుంటుండగా, ఇద్దరికీ ఒకేసారి స్వామివారు వెలసినట్లు కల వచ్చిందట. వారు ఆ ప్రదేశమంతా వెతికినా స్వామి కనిపించలేదు. నిరాశతో తిరిగి వెళ్తున్న క్రమంలో, గొర్రెలు కాస్తున్న ఒక చిన్న బాలుడు వారికి స్వామి వెలసిన స్థలాన్ని చూపించాడని, అప్పుడు అక్కడే ఉగ్రరూపంలో వెలసిన నరసింహస్వామిని గుర్తించి గుడి కట్టించారని స్థానికులు చెబుతారు. శివుడికి, విష్ణువుకి గల సాన్నిధ్యాన్ని సూచించేలా శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్టించబడింది.

“అల్లు బండ” ప్రత్యేకం..

ఈ ఆలయం యొక్క ముఖ్య ఆకర్షణలలో ఒకటి “అల్లు బండ”. ఈ బండ వద్ద తమ కోరికలను మొక్కుకున్న భక్తులు, దానిని ఎత్తే ప్రయత్నం చేస్తారు. మగవారు రెండు మోచేతులతో, ఆడవారు రెండు బొటనవేళ్లతో ఈ బండను ఎత్తుతారు. కోరికలు నెరవేరిన వారు మళ్లీ వచ్చి బండను ఎత్తుతారని, అప్పుడు అది సులభంగా ఎత్తబడుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆచారం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలగడం, కష్టాలు తీరడం, పంటలు సమృద్ధిగా పండడం వంటి మహిమలు అనుభవించిన భక్తులు అనేకమంది ఉన్నారు. అదిలాబాద్ జిల్లాలోని అంకోలి గ్రామం నుండి 25-30 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్న భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. వేములవాడ నుంచి వచ్చే భక్తులు కూడా ఏది మొక్కుకున్నా జరుగుతుందని, స్వామివారి పట్ల తమకు గొప్ప నమ్మకం ఉందని తెలిపారు.

ప్రతి నెలా 12వ తేదీన జాతర

స్వామివారు దక్షిణాభిముఖంగా వెలసి ఉండగా, ఆయనకు ఎదురుగా గరుత్మంతుడు, తూర్పు ముఖంతో ఆంజనేయస్వామి ఉపాలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో దీపస్తంభం, 365 రోజులు నీరు ఇంకకుండా ఉండే ఒక పవిత్ర పుష్కరిణి కూడా ఉన్నాయి. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలను, జాతరను ఘనంగా నిర్వహిస్తారు. పున్నమి నాడు, ముఖ్యంగా ప్రతి నెలా 12వ తేదీన జాతర ఉంటుంది. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. గుట్టపైకి చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటు, వాహనాలకు ఘాట్ రోడ్డు కూడా ఉంది, అయితే దీని పనులు పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన మహిమలతో భక్తుల కోరికలను తీరుస్తూ, వారికి సుఖసంతోషాలను ప్రసాదిస్తున్నారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించాలా లేదా అనేది మీ వ్యక్తి గతం.)

Follow Us