AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500 లంచం ఇవ్వడానికే బాధపడ్డ ఐపీఎస్.. ఇప్పుడు రూ.1 కోటి అవినీతి ఆరోపణలు..!

ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సల్‌పై రూ.1 కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో, ఆయన యూపీఎస్సీకి ఎంపిక కాకముందు ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బన్సల్ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కేవలం రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చినందుకే తనకు చాలా బాధగా అనిపించిందని చెప్పిన మాటలు.. ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది.

రూ.500 లంచం ఇవ్వడానికే బాధపడ్డ ఐపీఎస్.. ఇప్పుడు రూ.1 కోటి అవినీతి ఆరోపణలు..!
Rahul Bansal, Ips Officer
Balaraju Goud
|

Updated on: Aug 13, 2026 | 2:37 PM

Share

ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సల్‌పై రూ.1 కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాఫిక్‌గా మారాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో, ఆయన యూపీఎస్సీకి ఎంపిక కాకముందు ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బన్సల్ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కేవలం రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చినందుకే తనకు చాలా బాధగా అనిపించిందని చెప్పిన మాటలు.. ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది.

మాక్ ఇంటర్వ్యూలో రాహుల్ బన్సల్ తన సోదరుడి బర్త్ సర్టిఫికేట్ వ్యవహారాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాను ఐఐటీ కాన్పూర్‌లో చదువుతున్నానని, తన సోదరుడు రిసార్చ్ రిపోర్టు సమర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉండటంతో వీసా కోసం బర్త్ సర్టిఫికేట్ అవసరమైంది. ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి ఒక పంచాయతీ అధికారి రూ.500 డిమాండ్ చేశారని, ఆ మొత్తాన్ని ఇవ్వడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పినట్లు వైరల్ వీడియోలో ఉంది.

అదే ఇంటర్వ్యూలో వ్యవస్థలో అవినీతి, పరిపాలనా లోపాలు ఉన్నప్పటికీ, కొంతమంది అధికారుల చర్యల ఆధారంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంచనా వేయడం సరికాదని బన్సల్ అభిప్రాయపడ్డారు. పోలీసు సంస్కరణలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పరిపాలనలో జవాబుదారీతనం వంటి అంశాలపైనా ఆయన తన స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

వీడియో ఇక్కడ చూడండి

అయితే, ఇప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలతో ఆ పాత వ్యాఖ్యలు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్సల్‌పై తన తొలి ఫీల్డ్ పోస్టింగ్ సమయంలో రూ.1 కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో హవాలా మార్గంలో రెండు విడతల్లో రూ.50 లక్షల చొప్పున మొత్తాలు అందుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసు సైబర్‌ మోసం సంబంధిత దర్యాప్తుతో ముడిపడి ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు స్పందించింది. కేసులో దర్యాప్తు సంస్థల చర్యలపై నివేదిక కోరుతూ సీబీఐ, ఛత్తీస్‌గఢ్ డీజీపీకి కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున, బన్సల్‌పై వచ్చిన ఆరోపణలు ఇంకా న్యాయపరంగా నిరూపితం కాలేదు.

సివిల్ సర్వీసెస్‌లో చేరే సమయంలో అభ్యర్థులు నిజాయితీ, ప్రజాసేవ, అవినీతి నిర్మూలన వంటి విలువలను ప్రస్తావించడం సాధారణం. అందుకే బన్సల్ పాత వీడియోలోని మాటలు, ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలతో పోల్చుతూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే వైరల్ వీడియో, సోషల్ మీడియా వ్యాఖ్యలు ఆరోపణలకు సాక్ష్యంగా పరిగణించలేమని, తుది వాస్తవాలు దర్యాప్తు, ఆధారాలు, న్యాయ ప్రక్రియ ద్వారానే తేలాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఈ కేసు నేపథ్యంలో ప్రభుత్వ అధికారులపై జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థల ప్రభావం, సివిల్ సర్వీసెస్‌లో నైతిక విలువల ప్రాధాన్యతపై మరోసారి చర్చ మొదలైంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాహుల్ బన్సల్‌పై ఉన్న ఆరోపణలను ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us