Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుమల ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టిటిడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ముర్ముకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించి.. కోర్కెలు తీర్చే కోదండరాయుడిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. మొదటగా శ్రీవారి ఆలయం వద్ద ఉన్న శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టిటిడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ముర్ముకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించి.. కోర్కెలు తీర్చే కోదండరాయుడిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి రాష్ట్రపతికి వివరించారు.
స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ముకు రంగనాయకుల మండపంలో అర్చకుల బృందం వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటాన్ని అధికారులు అందజేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ద్రౌపతి ముర్ముకు అందజేశారు. రాష్ట్రపతితో పాటు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి సహా కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణ స్వామి, సత్యనారాయణ, రోజా, దేవాదాయ సహా ఆలయాధికారులు ఉన్నారు.
స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల నుండి తిరుగు పయనమయ్యారు. పద్మావతి అతిథి గృహం వద్ద రాష్ట్రపతికి టీటీడీ అధికారుల సాదర వీడ్కోలు పలికారు. అలిపిరి వద్ద టీటీడీ గో మందిరం సందర్శించనున్న రాష్ట్రపతి అనంతరం పద్మావతి అతిధి గృహంలో బ్రేక్ ఫాస్ట్ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ కానున్నారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి మధ్యాహ్నం నేరుగా డిల్లీకి పయనం అవుతారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..