AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Podu Farming Fight: ఆ ఇద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే.. ప్రభుత్వంపై యుద్ధం తప్పదంటున్నారు.. దీని వెనుక కారణం ఏంటీ..!?

ఏజెన్సీలో పోడు పోరు రగులుతోంది. అడవి కార్చిచ్చులా నలు మూలలా విస్తరిస్తోంది. ఒక్క జిల్లా అని కాదు.. తెలంగాణలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు అదే ఆందోళన కనిపిస్తోంది.

Podu Farming Fight: ఆ ఇద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే.. ప్రభుత్వంపై యుద్ధం తప్పదంటున్నారు.. దీని వెనుక కారణం ఏంటీ..!?
Telangana Podu Farming Fight
Balaraju Goud
|

Updated on: Jul 01, 2021 | 8:46 PM

Share

Telangana Podu Farming Fight: ఏజెన్సీలో పోడు పోరు రగులుతోంది. అడవి కార్చిచ్చులా నలు మూలలా విస్తరిస్తోంది. ఒక్క జిల్లా అని కాదు.. తెలంగాణలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు అదే ఆందోళన కనిపిస్తోంది. పొలం పనుల్లో ఉండాల్సిన పోడు రైతులు పోరు బాట పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము సైతం సై అన్నట్టుగా రైతుల పక్షాన గళం విప్పుతున్నారు.

ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ ఇన్నాళ్ల పాటు ఆగిపోయింది పోడు వ్యవసాయం. పులి దెబ్బకు హడలిపోయిన స్థానికులు తాము చేసే పోడు వ్యవసాయం గత కొంత కాలంగా ఆపేశారు. ఇదే అదనుగా భావించిన స్థానిక అటవీశాఖ ఇక్కడి భూములను ఆక్రమించే యత్నం చేసింది. హరితహారం సాకుగా చూపి.. ఇక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేసింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తమ ప్రభుత్వ అధికారులతోనే పంచాయతీ మొదలైంది. దీంతో పొడు భూముల్లో భీకర వాతావరణం ఎందుకు నెలకొంది..

విత్తనాలు నాటే సమయం వచ్చిందంటే చాలు కొందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటే.. ప్రభుత్వంలోని కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ ప్రభుత్వం పైనే తామే యుద్దానికి సిద్ధం అనే సంకేతాలు ఇవ్వడంతో ప్రభుత్వ పెద్దలు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పొడు భూముల వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకాన పడుతుంది.. ఇప్పటికే ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు సార్లు అటవీశాఖ అధికారులపై యుద్ధం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆదివాసీ బిడ్డలు కదలి రావాలి అని పిలుపు నివ్వడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

పొడు భూముల్లో ఆదివాసులకు వ్యవసాయం అనుమతి లేదంటూ ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకోవడం వారికి వీరికి మధ్య గొడవలు జరగడం ఒకానొక సందర్భంలో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు అటవీశాఖ అధికారులకు ఎంత చెప్పినా సీన్ రిపిట్ అవ్వడం పట్ల పొడు భూములు ఉన్న ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కూడా అటవీశాఖ పై యుద్దానికి సిద్ధం అంటూ ప్రకటన చేయడంతో మరో మారు పొడుభూముల సమస్య తీవ్రతరం అయింది. విత్తనాలు నాటకుండా అధికారులు అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని కొనప్ప హెచ్చరించారు. అయితే, గతంలో ఇదే నియోజకవర్గంలో పొడుభూముల విషయంలో కొనప్ప తమ్ముడుపై అటవీశాఖ అధికారులపై దాడి చేశాడని కేసులు కూడా పెట్టారు.

ఇప్పటికే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. పొడు భూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, తమ నియోజకవర్గాల్లో ఆదివాసీ ఓటు బ్యాంక్ కలిగిన ఎమ్మెల్యే ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలకు అటూ ప్రభుత్వ అధికారులను ఎదిరించలేక.. ఇటు తమ ప్రజలను కాదనలేక నలగిపోతున్నారంట. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యేలు పలుమార్లు మొరపెట్టుకున్నారని సమాచారం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కోనేరు కొనప్ప, రాథోడ్, బాపురావు, రేఖా నాయక్. ఖమ్మంలో వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, మెచ్చ నాగేశ్వరరావు పొడు భూముల సమస్యతో సతమతం అవుతూన్నట్లు సమాచారం.

Read Also…  Supreme Court: హైదరాబాద్‌లో ఆంక్షలు పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఈ-పాస్ సదుపాయం ఉందన్న ధర్మాసనం