Vijayashanthi : ఎర్రబెల్లిని అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారు : విజయశాంతి

తెలంగాణ బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి కొంతకాలంగా కేసీఆర్ సర్కారుపై వరుస విమర్శలకు దిగుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు..

Vijayashanthi : ఎర్రబెల్లిని అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక చుక్కలు చూపించారు  : విజయశాంతి
Vijayashanthi
Follow us

|

Updated on: Jun 19, 2021 | 9:53 PM

Vijayashanthi : తెలంగాణ బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి కొంతకాలంగా కేసీఆర్ సర్కారుపై వరుస విమర్శలకు దిగుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే “ఉపాధి హామీ” ఉంది తప్ప… విధుల‌కు తమను దూరం పెట్టి పగ సాధిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుతో బ్రతుకులకు హామీ లేకుండా ఉన్నాయని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారని విజయశాంతి తెలిపారు.” ఇలా తెలంగాణలో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా… అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలా లేదు.” అని విజయశాంతి విమర్శించారు.

పంటల కొనుగోళ్ళు లేక రైతులు… ఉద్యోగాల్లేక ఆత్మహత్యల బాటలో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని విజయశాంతి అన్నారు. “తన కళ్ళముందే ఇంత జరుగుతున్నా వారి సమస్యను తాను పరిశీలిస్తానని గాని, సీఎం దృష్టికి తీసుకెళతానని గాని కనీస హామీ ఇచ్చేందుకు కూడా ఆ మంత్రిగారు ధైర్యం చెయ్యలేని దుస్థితి కనిపించింది. కరోనా కష్టకాలంలో పనిలేక, జీతం రాక త‌మ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని రోదిస్తూ శాపనార్థాలు పెట్టారు. బంగారు తెలంగాణ ఇదేనా?” అని విజయశాంతి మండిప‌డ్డారు.

పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నామని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు మీడియా ముందు తీవ్ర వేదనకు గురయ్యారు. దీనిని కేసీఆర్ సర్కారు ఎలా చూస్తోందని విజయశాంతి ప్రశ్నించారు. తక్షణమే మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Read also : Kodali Nani : నారా లోకేష్, చంద్రబాబుపై మళ్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీ మంత్రి కొడాలి నాని