రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డు తగిలిన ఒకే ఒక్కడు.. రైతుల చట్టాలను రద్దు చేయాలని ప్లకార్డుల ప్రదర్శన
పార్లమెంటులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అడ్డుతగిలింది. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా..
పార్లమెంటులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అడ్డుతగిలింది. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆర్ఎల్పీ ఎంపీ ప్లకార్డు ప్రదర్శించారు.
బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని ఇప్పటికే 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించగా మరికొన్ని పక్షాలు హాజరయ్యాయి. అయితే మొన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా మెలిగిన ఆర్ఎల్పీ నిరసన తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు గళమెత్తాడు. ప్లకార్డ్ ప్రదర్శించి రైతుల పోరాటానికి మద్దతు పలికాడు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంతో ఎన్డీఏ నుంచి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బయటకు వచ్చింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతూ పార్లమెంట్లో కూడా ఆందోళన కొనసాగించింది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా సభలోనే డిమాండ్ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతరం సభనుంచి బయటికి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు.