Uttarakhand New President: ఉత్తరాఖండ్ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం.. పార్టీ శ్రేణులు కోరిక మేరకు ఈ మార్పు
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మదన్ కౌశిక్ నియమిస్తూ ఇవాళ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు బన్షిధర్ భగత్ స్థానంలో..
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మదన్ కౌశిక్ నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు బన్షిధర్ భగత్ స్థానంలో మదన్ కౌశిక్ బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన బన్షిధర్ భగత్కు సీఎం తిరథ్ సింగ్ రావత్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. పార్టీ కొత్త అధ్యక్షుడిగా మదన్ కౌశిక్ హరిద్వార్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్గా ఆయనకు గుర్తింపు ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో ఈ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది బీజేపీ జాతీయ పార్టీ.
ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి త్రివేంద్ర సింగ్ రావత్ను తప్పించిన బీజేపీ అధిష్టానం… ఆ బాధ్యతలను తిరథ్ సింగ్ రావత్కు అప్పగించిన విషయం తెలిసిందే. ముందుగా.. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ను బీజేపీ శాసన సభాపక్షం ఎంపిక చేసింది. త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో బుధవారం సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తరాఖండ్లో బీజేపీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆయన పాలన పట్ల చాలా రోజుల నుంచి రాష్ట్ర బీజేపీ కార్యకర్తల్లో చాలాకాలంగా అసంతృప్తి ఉంది. మంత్రివర్గానికి సమాచారం ఇవ్వకుండానే.. ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్సేణ్ను నూతన పరిపాలన కేంద్రంగా త్రివేంద్ర సింగ్ ప్రకటించారు. ఇది సొంత పార్టీ నేతలకు అస్సలు రుచించలేదు.
త్రివేంద్ర సింగ్ రావత్ పనితీరు పట్ల సొంత పార్టీలోని కీలక నేతలతోపాటు సమాన్య కార్యకర్తలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. త్రివేంద్ర సింగ్ కారణంగా క్షేత్ర స్థాయిలో బీజేపీ పట్టు సడలుతోందని భావించిన పార్టీ పెద్దలు పార్టీ పదవికి రాజీనామా చేయాలని ఆయనకు సూచించారు. ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీలో మంచి పదవిని అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.