సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే..
ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జి చేశారు. ఆ తరువాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు.
Fairoz Baig | Edited By: Srikar T
Updated on: May 20, 2024 | 11:05 AM

ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీచార్జి చేశారు. ఆ తరువాత టియర్ గ్యాస్ను ప్రయోగించారు.

ఆపై వాటర్ క్యానన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఉరుము లేని పిడుగులాగా ఒంగోలులో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణమేంటంటే.. కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారట. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడిన ప్రజానీకం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

సినీ ఫక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు అల్లరిమూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తరువాత ఔరా అనుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయపార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఒంగోలులో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నడిరోడ్డుపై సినీ ఫక్కీల్లో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ను చేసి చూపించారు. తద్వారా అల్లర్లకు పాల్పడేందుకు సిద్దమయ్యే అల్లరిమూకలు స్వీయ నియంత్రణలో ఉంటారన్నది పోలీసుల ఆలోచనగా ఉంది. దీనికోసం ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కూడలిని ఎంచుకున్నారు. అప్పటికే ఏఆర్ డిఎస్పి అశోక్కుమార్ ఆధ్వర్యంలో సిద్దంగా ఉన్న అల్లరిమూకల వేషాల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా బస్టాండ్ సెంటర్లోకి దూసుకొచ్చారు.

కౌంటింగ్లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అల్లరి మూకలను కట్టడి చేసేందుకు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేశారు. ఈ సందర్బంగా పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అనంతరం వాటర్ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాలపాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో 20 నిమిషాలపాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

కౌంటిగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ప్రకాశంజిల్లా ఎస్పి గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో, ఆ తరువాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.





























