- Telugu News Photo Gallery IMD Issues Red Alert In A Few Districts Of Telangana and Andhra Pradesh, Details Here
Red Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది.
Updated on: Jul 26, 2023 | 9:04 AM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈరోజు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అయితే, తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఐదారు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయ్.. పొంగిన వాగులు, తెగిన రహదారులతో రాకపోకలు స్తంభించాయ్.. వాతావరణ శాఖ.. ఇప్పుడు ఏకంగా.. రెడ్, ఆరెంజ్, ఎల్లో.. మొత్తం మూడు రకాల అలర్ట్లు జారీ చేసింది. దాంతో.. ఇవాళ ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

రెడ్ అలర్ట్ జిల్లాలు.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు.. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. ఎల్లో అలర్ట్ లో 15 జిల్లాలు.. నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్, మంచిర్యాల, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ ఉన్నాయి.

ఏపీలో భారీ వర్షాలతో వాగులు పొంగుతూ.. రోడ్లు జలమయం అవుతున్నాయి. ఇక గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలా చోట్ల విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది.

ఏపీలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. పల్నాడు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, ప.గో., అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణవిభాగం సూచింది.
