ICICI Bank EMI: కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఐసీఐసీఐ బ్యాంకు.. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఈఎంఐ సదుపాయం
ICICI Bank EMI: ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు ఏడాది పాటు రోజు వారీ కూలీల నుంచి వ్యాపారస్తుల వరకు చాలా మంది నష్టోయారు...
Updated on: Mar 25, 2021 | 6:35 PM

ICICI Bank EMI: ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు ఏడాది పాటు రోజు వారీ కూలీల నుంచి వ్యాపారస్తుల వరకు చాలా మంది నష్టోయారు. చాలా మంది ఈఎంఐలను పెట్టుకుని చెల్లిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఐసీఐసీ బ్యాంక్ వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిపే చెల్లింపులను సులభ వాయిదాల పద్దతుల్లో (ఈఎంఐ)కి మార్చుకునే అవకాశాన్ని తన వినియోగదారులకు కల్పిస్తోంది. ముందస్తు ఆమోదం ఖాతాదారులకు ఇది వర్తించనుంది. ఈఎంఐ ఎట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేరుతో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన మొదటి బ్యాంకు తమదేనని పేర్కొంది. ఇందు కోసం అదనంగా ఎలాంటి ఛార్జీలు వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని సదరు బ్యాంకు వెల్లడించింది. ఇంటర్నెట్ ప్లాట్ ఫాం ద్వారా వినియోగదారులు వారి పొదుపు ఖాతా నుంచి సులభ వాయిదాల్లో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

బీమా ప్రీమియం, పాఠశాల ఫీజులు చెల్లించవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న చెల్లింపును 3, 6, 9, 12 నెలల వాయిదాలుగా వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం బిల్డెస్క్, రేజర్పే పేమెంట్ గేట్వేలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.

అలాగే ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లు, బీమా, పర్యాటకం, విద్య- పాఠశాల ఫీజులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాల వంటి 1000కి పైగా వ్యాపార సంస్థలతో కలిసి తొలుత ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.




