TELANGANA POLITICS: ఒక్కసారిగా హీటెక్కిన తెలంగాణ రాజకీయం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు వరుస షాకులు.. ఆకర్షలో బీజేపీ దూకుడు
తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. మూడు, నాలుగు నెలల నుంచి దూకుడు పెంచిన బీజేపీ.. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఝలక్ మీద ఝలక్ ఇస్తోంది. తాజాగా ఈటల రాజేందర్, డీకే అరుణ రూపొందించిన జాబితాలో వున్న పేర్లు మరింత కలవరం రేపుతున్నాయి.

TELANGANA POLITICS SUDDENLY HEATED UP BIG SHOCKS TO TRS CONGRESS PARTIES: తెలంగాణ పాలిటిక్స్ ఉన్నట్టుండి వేడెక్కాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ వరుసగా షాకులివ్వడం షురువైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాకివ్వగా.. రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇంకోవైపు ఈటల రాజేందర్, డికే అరుణ రూపొందించిన చేరికల జాబితా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల్లో కలకలం రేపుతోంది. జులైలో భారీ వర్షాలు కావచ్చు.. మరేదైనా కారణం కావచ్చు తెలంగాణ రాజకీయం కాస్త స్తబ్ధుగా కొనసాగింది. కానీ ఆగస్టు మాసం వచ్చి రావడంతోనే తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పింది. పొలిటికల్ గేమ్స్ ముమ్మరమయ్యాయి. రాజీనామాల పర్వం మొదలైంది. గత పక్షం రోజులుగా రాజీనామా అంశాన్ని నానుస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఓవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఆగస్టు 2న శ్రీకారం చుట్టారు. పార్టీ బలంగా లేని ప్రాంతంలో పార్టీ సత్తా ఏంటో చాటుతానని సంజయ్ ప్రారంభోపన్యాసంలో వెల్లడించారు. ఇంకోవైపు బీజేపీలో చేరబోతున్న ఇతర పార్టీల నేతల జాబితాతో బీజేపీ ఆకర్ష్ కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ ఢిల్లీ వెళ్ళారు. ఈక్రమంలోనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ కంటే ముందే టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత రాజయ్య యాదవ్ అధికార పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. రాజయ్య యాదవ్ బీజేపీలో చేరబోతున్నారు. రాజయ్య యాదవ్ ప్రకటన చేసిన మర్నాడే రాజగోపాల్ నిర్దిష్టమైన ప్రకటనతో మీడియా ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభ స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీలో చేరుతున్నట్లు డైరెక్టు ప్రకటన చేయలేదు. కానీ మోదీ సారథ్యంలోనే కేసీఆర్ను ఓడించే అవకాశం వుందని తేల్చి చెప్పారు. తద్వారా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ఇన్డైరెక్టుగా తెలిపారు.
ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రతీ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడింది అధిష్టానం. ఇందుకోసం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ‘‘ప్రతి నెలా చేరికలు ఉండాలి..టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్లు ఇవ్వాలి..’’ ఇదే బీజేపీ ప్లాన్గా కనిపిస్తోంది. అందుకోసం ఢిల్లీలో వ్యూహాలు రచిస్తోంది కాషాయ దళం. చేరికలపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు రాష్ట్ర నేతలు. ఈటల రాజేందర్, డీకే అరుణ 15 మందితో లిస్ట్ పార్టీ అధిష్టానం చేతికందించినట్లు సమాచారం. వారి చేరికకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా ప్రకటించారు. ఉప ఎన్నికతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతోనే రాజీనామా చేస్తున్నానని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో గౌరవం ఉందంటూనే పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింతగా కుంగిపోయేలా చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే పార్టీ పగ్గాలు 20 ఏళ్ళ పాటు సోనియా గాంధీని విమర్శిస్తూ వచ్చిన వారికిచ్చారని చురకంటించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్దగా ప్రాతినిధ్యం లేని వారికి, సీమాంధ్ర నేతలతో అంటకాగే వారికి పార్టీ పగ్గాలివ్వడం కరెక్టు కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నారు రాజగోపాల్రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కాంగ్రెస్లో ఉండి చేసేదేం లేదన్నారు కోమటిరెడ్డి. తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాజగోపాల్ ప్రకటనతో మునుగోడు బై ఎలక్షన్ వార్ షురూవైనట్లే భావించాలి. మునుగోడు సెంటర్గా టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీది రాజకీయ ఆపేక్ష.. అధికార యావ అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దానికి ధీటుగా కౌంటరిచ్చారు ఈటల రాజేందర్. మొదట మునుగోడుకి ముహూర్తం పెట్టుకుని ఆ తర్వాత చేరికలను కంటిన్యూ చేయాలనేది బీజేపీ ప్లాన్గా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ అందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయడం వంటి వ్యూహాలకు పదును పెట్టింది. బలమైన నేతల్ని, పార్టీలో చేరాలనుకునే వారిని ఆకర్షిస్తోంది. అందుకోసమే ఢిల్లీ వెళ్లారు చేరికల కమిటీ సభ్యులు. ఈటల రాజేందర్, డీకె అరుణ, వివేక్, లక్ష్మణ్ మరికొందరు పార్టీ పెద్దలతో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజగోపాల్.. బండి సంజయ్ పాదయాత్రలోనే బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అయితే, ఆయన జాయినింగ్ కన్ఫర్మ్ అయ్యాకనే జేపీ నడ్డా సమక్షంలోనా లేక అమిత్ షా సమక్షంలోనా ఆయన కమలం కండువా కప్పుకోబోతోంది తేలబోతోంది. ఇక వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ప్రదీప్రావు టీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్టు సమాచారం. ప్రదీప్ రావు కూడా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆగస్టు మూడో తేదీన ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం అవుతున్నారు. ఆగస్టు 7వ తేదీన టీఆర్ఎస్కు ఎర్రబెల్లి ప్రదీప్రావు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో హోంమంత్రి అమిత్షా సమక్షంలో ప్రదీప్రావు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అధిష్టానానికి అందించిన లిస్టులో ప్రదీప్రావు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు సైతం కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైతం లిస్ట్ ఉన్నట్లు సమాచారం. నకిరేకల్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, బాల్కొండకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్రెడ్డి ఈటల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 31వ తేదీన హైదరాబాద్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులురెడ్డి కూతురు నిశ్చితార్ధం జరిగింది. ఆ వేడుకలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల కన్నా బీజేపీ నేతల హడావిడే ఎక్కువగా కనిపించింది. అదే కొత్త చర్చకు దారితీస్తోంది. పొంగులేటి బాట కూడా బీజేపీ వైపే అన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకుడు మనోహర్రెడ్డి సైతం బీజేపీలో చేరబోతున్నారు. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుని దూకుడు పెంచాలని భావిస్తోంది కాషాయ దళం. వీటన్నింటికన్నా మునుగోడులో ఉప ఎన్నిక రావడం ద్వారా హుజూరాబాద్ తరహాలో మరోసారి టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తోంది. రెండు రోజుల్లో మరోసారి ఢిల్లీ వెళ్లి అమిత్షాతో ఫైనల్గా చర్చలు జరుపుతారు రాష్ట్ర నేతలు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 15 సీట్లే వస్తాయని చెబుతున్నారు బండి సంజయ్. మీడియాతో చిట్చాట్లో చాలా హాట్ కామెంట్స్ చేశారు బండి. తాము అధికారంలోకి వస్తే చట్టపరంగా కేసీఆర్ని జైల్లో వేస్తామని వ్యాఖ్యానించారు. బీహార్లో లాలుప్రసాద్ యాదవ్ను చట్టపరంగా జైలుకు పంపలేదా అని గుర్తుచేశారు. ఎప్పుడు, ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు బండి. ఓవైపు బీజేపీలో దూకుడు కనిపిస్తుండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మాటల్లో పదును పెరుగుతోంది. బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ల యుద్దం కొనసాగిస్తున్నారు. మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్.పీ.ఏ. (Non-Performing Alliance) ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు,నలుగురు చొప్పున ఎమ్మెల్యే అభ్యర్థులున్నారంటూ పైకి ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ నేతలు.. లోలోపల పార్టీని వీడే అవకాశాలున్న నేతలను బుజ్జగించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.