వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి చూపు..
విశ్వ వేదికపై భారత్ గళం ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ అనిశ్చితి నడుమ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆ ప్రజాస్వామ్య స్వరాలు ఏం చెప్పబోతున్నాయి? దీనికి సమాధానమే టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్-2026. ఈ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశాలు.. ప్రధాని మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగాలు.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ వేదికపై దేశ పాత్రను చర్చించేందుకు వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్-2026 సిద్ధమైంది. మార్చి 23, 24 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సులో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ గళాలలో ఒకరైన అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. మార్చి 24న జరగనున్న చర్చా వేదికపై అసదుద్దీన్ ఒవైసీతో పాటు అఖిలేష్ యాదవ్, స్మృతి ఇరానీ వంటి ఉద్ధండులు పాల్గొంటున్నారు. ‘‘భారతదేశం, ప్రపంచం అనే ప్రధాన ఇతివృత్తంతో సాగే ఈ చర్చలో ప్రస్తుత ప్రపంచ గందరగోళం మధ్య భారత ప్రజాస్వామ్యం, మైనారిటీల హక్కులు, దేశ విదేశీ విధానంపై ఒవైసీ తనదైన శైలిలో విశ్లేషణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, భారతదేశ వ్యూహం ఎలా ఉండాలి అనే అంశంపై ఒవైసీ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
భారత్ ఒక ఆశాకిరణం
సదస్సు ప్రారంభానికి ముందు టీవీ9 నెట్వర్క్ ఎండీ అండ్ సీఈఓ బరుణ్ దాస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అన్నారు. “భారత్ ప్రస్తుతం చరిత్రలో ఒక ప్రత్యేకమైన సంధి దశలో ఉంది. తన కోసం తాను మాట్లాడుకునే ఆత్మవిశ్వాసం దేశంలో పెరిగింది” అని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం
ఈ రెండ్రోజుల సదస్సులో అత్యంత కీలకమైంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరుకావడం ఇది మూడవసారి. గతంలో నూతన భారతదేశం దార్శనికతను వివరించిన ప్రధాని, ఈసారి అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు.
హాజరుకానున్న ప్రముఖులు
ఈ మెగా సమ్మిట్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్తో పాటు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులే కాకుండా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ, యోగా గురువు బాబా రామ్దేవ్, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజం మార్కస్ వాంబాచ్ వంటి వారు కూడా హాజరవుతున్నారు.
