AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌.. పశ్చిమ బెంగాల్‌ సెకండ్‌ ఫేజ్‌ పోలింగ్‌ షురూ..!

పశ్చిమ బెంగాల్‌లో రెండవ, చివరి దశ పోలింగ్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రారంభమైంది. ఈ రెండవ దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో, 152 స్థానాలలో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ రెండవ దశలో 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.

ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌.. పశ్చిమ బెంగాల్‌ సెకండ్‌ ఫేజ్‌ పోలింగ్‌ షురూ..!
West Bengal Phase 2 Polling
Balaraju Goud
| Edited By: |

Updated on: Apr 29, 2026 | 8:38 AM

Share

ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తలపించిన పశ్చిమ బెంగాల్‌ సెకండ్‌ ఫేజ్‌ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది…! నాలుగోసారి గెలిచి రికార్డులు బద్దలు కొట్టాలని మమతా ఉవ్విళ్లూరుతుంటే… ఈసారి ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. అయితే తొలిదశ పోలింగ్‌లో బంపర్ ఓటింగ్ నమోదు అవ్వడం.. మమతకు పట్టున్న దక్షిణ బెంగాల్, కోల్‌కతా ప్రాంతాల్లో ఇవాళ సెకండ్ ఫేజ్‌ జరుగుతుండడంతో ఆసక్తి నెలకొంది. మరోవైపు పోలింగ్‌కి ముందు భద్రతా చర్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

బెంగాల్ రాజకీయ భవిష్యత్తును శాసించే రెండో విడత సమరానికి సర్వం సిద్ధమైంది. ఎనిమిది జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 142 స్థానాల నుంచి ఏకంగా 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉండటం పొలిటికల్ కాక రేపుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరీ ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై మరింత ఫోకస్ పెట్టారు. అల్లర్లు తలెత్తకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,300 మందిని అరెస్ట్‌ చేయగా.. నిన్నటికి నిన్న మరో 800 మందిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రూట్‌ మార్చ్‌లు, చెక్‌ పాయింట్‌ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయడమే కాదు… ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 41,000 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 2వేల 3 వందల 21 కంపెనీల నుంచి CAPF బలగాలు మోహరించాయి. 160 మోటార్ సైకిల్ పెట్రోలింగ్ బృందాలు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ ను సైతం రంగంలోకి దించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటు అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

ఇక రెండో విడత ఎన్నికలు జరగనున్న దక్షిణ బెంగాల్, కోల్‌కతా ప్రాంతాలు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌కు కంచుకోటలు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 123 సీట్లను మమతా పార్టీ గెలుచుకుంది. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినా కూడా 18 సీట్లనే గెలవగలిగింది. గత ఎన్నికల్లో 77 సీట్లను గెలుచుకున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించింది. దానికి ఉత్తర బెంగాల్‌లో సాధించిన విజయాలే కారణం. దాంతో ఈసారి దక్షిణ బెంగాల్‌లోనూ ఆ స్థాయి విజయాలను సాధించాలని బీజేపీ ప్రచారం హోరెత్తించింది. రెండవ దశలో, భాంగర్ స్థానంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఉండగా, గోఘాట్‌లో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా 25 సంవత్సరాల తర్వాత బహరంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రెండో విడతలోనే సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి రాజకీయ భవితవ్యం తేలనుంది. భవానీపూర్‌లోనే ఈ అగ్ర నేతలిద్దరు పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో మమతకు 58 వేల 800 ఓట్ల మెజారిటీ ఇక్కడి నుంచే వచ్చింది. SIRలో భాగంగా భవానీపూర్‌లో ఏకంగా 51 వేల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మొత్తం ఓట్లలో ఇవి 21శాతం. దీంతో తృణమూల్‌లో ఆందోళన నెలకొంది. అందుకే తొలిసారిగా మమత క్షేత్ర స్థాయిలో ప్రచారం చేశారు. పలువురిని స్వయంగా కలిశారు. జైన్‌ మందిరాలు, గురుద్వారాలను కూడా సందర్శించారు. అలాగే బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌ షా సహా కీలక నేతలు ముమ్మర ప్రచారం చేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాంపెయిన్‌ చేసిన మోదీ… 14 సభల్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ మమత సర్కార్‌పై విరుచుకుపడ్డారు. సో… బెంగాల్‌ ఓటర్లు వరుసగా నాలుగోసారి మమతపై కరుణ చూపిస్తారా..? లేక తొలిసారి బీజేపీకి పట్టం కడతారా అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us