లోక్బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఎగిపడుతున్న మంటలు
లక్నోలోని లోక్బంధు ఆసుపత్రిలో సోమవారం(ఏప్రిల్ 14) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను చూసి, రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. హడావిడిగా, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులను ఆసుపత్రి నుండి బయటకు తరలించారు. ఇప్పటివరకు 200 మంది రోగులను తరలించారు. చాలామంది ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ సంఘటనా స్థలానికి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పైఅంతస్తు వరకు మొత్తం పొగ, మంటలు వ్యాపించాయి. రోగులు, వారి సహాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రోగులను తరలిస్తున్నారు. అగ్నిమాపక దళ వాహనాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో రోగులతో పాటు వారి సహాయకులు శ్వాస తీసుకోవడం కష్టమైంది. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు.
ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు లేదా మరణించినట్లు ఎటువంటి నివేదిక లేదు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది.
లోక్ బంధు ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమీక్షిస్తున్నారు. అధికారుల నుండి ఫోన్ ద్వారా పూర్తి సమాచారం పొందారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను మరొక కేంద్రానికి తరలించాలని సూచించారు. డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడవ అంతస్తులో పొగ కనిపించింది. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే రోగులను తరలించడం ప్రారంభించారు. దాదాపు 200 మంది రోగులను తరలించారు. వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ తెలిపారు. భవనం లోపల మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళం సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..