Tiger Terror: వామ్మో మ్యాన్ ఈటర్స్.. చంద్రపూర్ జిల్లాను వణికిస్తున్న రక్తం రుచిమరిగిన పులులు
Tiger Terror: ఆపరేషన్ మ్యాన్ ఈటర్ చేపట్టిన మహారాష్ట్ర అటవిశాఖ బాలాపూర్ , యెనోలి కోట్ అటవి ప్రాంతంలోని కంటోన్మెంట్ 168 లోని రక్షిత అటవీ ప్రాంతంలో ఎట్టకేలకు పులిని బందించింది. పట్టు బడ్డ పులి 20 నెలల వయసున్న T-139 (ఆడ) అనే..

Tiger Terror: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా అటవిప్రాంతాన్ని మ్యాన్ ఈటర్ లో హడలెత్తిస్తున్నాయి. వరుస దాడులతో మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊర్ల మీద పడుతూ వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంటున్నాయి. ఓ వైపు ఆపరేషన్ మ్యాన్ ఈటర్ చేపట్టిన మహారాష్ట్ర అటవిశాఖ రక్తం రుచి మరిగిన బెబ్బులను బందిస్తున్నా.. పులుల సంఖ్య విఫరీతంగా పెరగడంతో అటవి సమీప గ్రామాల్లో పులుల దాడులు మాత్రం ఆగడం లేదు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఒకే రోజు వేర్వేరు చోట్ల జరిగిన పులుల దాడులలో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చంద్రపూర్ జిల్లాలోని మూల్ అటవీ ప్రాంతంలో సోమనాధ్ బీట్ లో మారోడ గ్రామానికి చెందిన మహిళా కూలీలు శనివారం ఉదయం పత్తిచేనుకు పత్తి తీసేందుకు వెళ్లారు. పత్తి ఏరుతున్న క్రమంలో సునీత భోయర్(45) అనే వ్యవసాయ కూలీపై పులి వెనుక వైపు నుండి ఒక్కసారిగా దాడి చేసింది. మెడపై పంజా విసిరి సునీతను కొంత దూరం లాక్కొని వెళ్లింది. గమనించిన తోటి కూలీలు కేకలు వేయడం తో సునీత మృత దేహాన్ని వదిలేసి అడవిలోకి పారిపోయింది పులి. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని అధికారులను అడ్డుకున్నారు గ్రామస్తులు. మరో ఘటనలో మోహర్లీ అటవీ ప్రాంతంలోని పద్మాపూర్ అటవీ బీట్ పరిధి వరవట్ గ్రామానికి చెందిన కాశీనాథ్ లోన్బలే(60) అనే వ్యవసాయ కూలీని పొట్టన పెట్టుకుంది మరో పులి. సమీప అటవి ప్రాంతంలో వంటచెరకు కోసం వెళ్లిన కాశీనాథ్ పై పులి దాడి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారి సంతోష్.. తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి దాడిలోనే మృతిచెందాడని నిర్ధారించి బాధితులకు దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందజేశారు. వరుస పులి దాడులతో చంద్రపూర్ జిల్లా అటవిప్రాంతంలోని జనం భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ
మరో వైపు దాడులకు పాల్పడుతున్న మ్యాన్ ఈటర్లను బందించేందుకు ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతూనే ఉంది. చంద్రపూర్ జిల్లా నాగ్ బిడ్ తాలుకాలో మనుషుల పై దాడులకు పాల్పడుతున్న ఓ పులిని బందించింది అక్కడి అటవిశాఖ. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ శాఖ పరిధిలోని నాగ్భిడ్ తాలూకాలోని తలోధి అటవీ ప్రాంతంలో 15 రోజులుగా వరుస దాడులకు పాల్పడుతూ 5 గురుని పొట్టన పెట్టుకున్న మ్యాన్ ఈటర్ ను ఎట్టకేలకు బంధించింది అటవిశాఖ.
ఆపరేషన్ మ్యాన్ ఈటర్ చేపట్టిన మహారాష్ట్ర అటవిశాఖ బాలాపూర్ , యెనోలి కోట్ అటవి ప్రాంతంలోని కంటోన్మెంట్ 168 లోని రక్షిత అటవీ ప్రాంతంలో ఎట్టకేలకు పులిని బందించింది. పట్టు బడ్డ పులి 20 నెలల వయసున్న T-139 (ఆడ) అనే పులి గా గుర్తించింది మహా అటవిశాఖ. నాగ్ బిడ్ సబ్-కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కుమారస్వామి ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆ ప్రాంత వాసులు. వైద్య పరీక్షల అనంతరం పులి ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్టు తెలిపారు అదికారులు. ఈ టైగర్ ఆపరేషన్ 20 మందికి పైగా పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




