Nagaland Tension: నాగాలాండ్‌లో భద్రతా దళాల కాల్పులు.. 14మంది సాధారణ పౌరుల దుర్మరణం!

నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు.

Nagaland Tension: నాగాలాండ్‌లో భద్రతా దళాల కాల్పులు.. 14మంది సాధారణ పౌరుల దుర్మరణం!
Nagaland
Follow us

|

Updated on: Dec 05, 2021 | 9:49 AM

నాగాలాండ్‌లో దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.

అంతకుముందు నాగాలాండ్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేశారు. మోన్‌ జిల్లా ఓటింగ్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు తెగబడ్డారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనం చూసి ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపారు జవాన్లు. కూలీల బృందం తిరు గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 14మంది పౌరులు మృతి చెందారు.

మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు హింసకు పాల్పడ్డారు. NSCN మిలిటెంట్లుగా పొరపాటుపడి అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆందోళనకు దిగారు.. భద్రతా సిబ్బందికి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ కాల్పుల్లో మరికొందరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.

మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు. శనివారం సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. వారికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. తప్పుడు సమాచారంతో వారిని చంపేశారని ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే, మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు.

ఇక ఈ ఘటనపై నాగాలాండ్ సీఎం నైపూ రియో స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అని వ్యాఖ్యానించారు. అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులపై అత్యుతన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుందని.. బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు నాగాలాండ్ సీఎం. దయచేసి ప్రజంలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also… Viral News: ‘నేను కావాలా.. మటన్ కావాలా’.. భార్యకు భర్త అల్టిమేటం.. వైరల్‌గా మారిన ట్వీట్!

Latest Articles