Delta Plus Variant: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం నమోదు.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
Delta Plus Varient: గత ఏడాదికి పైగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో కొత్త కొత్త వేరియంట్లు వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి..
Delta Plus Variant: గత ఏడాదికి పైగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో కొత్త కొత్త వేరియంట్లు వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వైరస్ మహమ్మారి రోజురోజుకు తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చెందుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఈ వేరియంట్ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం సంభవించిందని ఆ రాష్ట్ర వైద్యాధికారులు ప్రకటించారు. కాగా, గడిచిన వారంలో 6 డెల్టా వేరియంట్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి 1,219 నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కు పంపించారు.
అయితే ఇందులో 31 శాతం నమూనాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది. మధ్యప్రదేశ్లో నమోదైన 6 డెల్టా వేరియంట్ కేసులలో భూపాల్లో 2, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్, అశోక్నగర్ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మన దేశంలో ఇప్పటి వరకు 318 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయట పడ్డాయి.
కాగా, ఒక వైపు వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా వ్యాప్తి.. ప్రస్తుతం కొత్త వేరియంట్లు రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ కఠిన చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం భారీగా పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. రాష్ట్రాలు కూడా అన్లాక్ ప్రకటించి తమతమ కార్యకలాపాలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ రావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం లాంటివి తప్పనిసరి అని సూచిస్తున్నారు.