Amarinder Singh New Party: వారు మినహా అమరీందర్ సింగ్ కొత్త పార్టీలో మరెవరూ చేరరు.. సిద్ధూ సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు
పంజాబ్లో ఇవాళ మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
పంజాబ్లో ఇవాళ మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ చీలిక వర్గంతో పొత్తుపై కూడా ఆయన ఈ సమావేశంలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ కొత్త పార్టీపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ సతీమణి, కాంగ్రెస్ నాయకురాలు నవ్జోత్ కౌర్ సిద్ధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ సింగ్తో వ్యక్తిగతంగా లబ్ధి పొందిన కొందరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎవరూ ఆయన పెడుతున్న కొత్త పార్టీలో చేరబోరని వ్యాఖ్యానించారు. అమరీందర్ సింగ్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు వీడుతారని తాను భావించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగిన ఎమ్మెల్యేలెవరూ అమరీందర్ సింగ్ పార్టీలోకి వెళ్లరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పదవులు అనుభవించి, ఈ స్థాయికి ఎదిగిన అమరీందర్ సింగ్.. పార్టీకి ద్రోహం తలపెడుతున్నారని ఆరోపించారు.
అమరీందర్ సింగ్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరితోనూ అధికారాలు పంచుకోలేదని.. ఆయన ఒక్కరే పూర్తి పెత్తనం చెలాయించారని నవ్జోత్ కౌర్ సిద్ధు విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా అమరీందర్ సింగ్ నమ్మేవారు కారని.. ఇప్పుడు ఆయన్ను ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టుకోవడం కంటే.. శిరోమణి అకాలీదళ్లో చేరాల్సిందని, అప్పుడు కొన్ని స్థానాల్లో అయినా ఆయన, ఆయన సన్నిహితులు గెలిచేవారని అభిప్రాయపడ్డారు.
Also Read..
Inspiration Story: భర్త, మామ మృతి.. కుటుంబం కోసం రైతుగా మారిన ఓ మహిళ.. ఏటా రూ.25 లక్షల సంపాదన