Power Crisis: బొగ్గు కొరతపై ప్రధాని మోడీ సమీక్ష.. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి

PM Modi on Power Crisis: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం యాక్షన్‌కి దిగింది. పవర్ క్రైసిస్‌కు అసలు ఛాన్సే లేదంటూనే చర్యలు చేపడుతోంది.

Power Crisis: బొగ్గు కొరతపై ప్రధాని మోడీ సమీక్ష.. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి
Pm Modi
Follow us

|

Updated on: Oct 12, 2021 | 6:58 PM

PM Modi on Power Crisis: విద్యుత్ సంక్షోభంపై కేంద్రం యాక్షన్‌కి దిగింది. పవర్ క్రైసిస్‌కు అసలు ఛాన్సే లేదంటూనే చర్యలు చేపడుతోంది. దేశంలో బొగ్గు కొరత, విద్యుత్ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు విద్యుత్ పరిస్థితిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికారులు వివరించగా, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్ హామీ ఇచ్చారు.

భారీ వర్షాలు, అంతర్జాతీయంగా బొగ్గు ధరల పెరుగుదల వల్లే బొగ్గు కొరత ఏర్పడిందని అధికారులు ప్రధాని మోడీకి వివరణ ఇచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికార వర్గాలు వెల్లడించాయి. బొగ్గు నిల్వల విషయాన్ని పవర్ ప్లాంట్స్ మిస్ మేనేజ్ చేశాయని పేర్కొన్నాయి. మరోవైపు, విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సంక్షోభం ముదురుతున్న వేళ కేంద్ర విద్యుత్‌ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం గ్గర ఉన్న కేటాయించని విద్యుత్‌ వాడుకోవాలని రాష్ట్రాలను కోరింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ సాయం చేయాలని కోరింది.

విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులతో సమస్య పరిష్కారంపై చర్చించారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణకు బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖల మంత్రులతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యపై 24 గంటల పాటు సమీక్షించాలని ఆదేశించారు.

దేశంలో విద్యుత్ సంక్షోభానికి అనేక కారణాలున్నా ప్రధానంగా పది రీజన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత, దానికి అనుబంధంగా జరిగిన పరిణామాలే కారణం. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధరలు షాక్ కొడుతున్నాయి. సెప్టెంబర్ 15వరకు యూనిట్ ధర 4 రూపాయల 60 పైసలు ఉంటే… అక్టోబర్ 8 నాటికి 15 రూపాయలకి చేరింది. దీంతో, విద్యుత్ కొనుగోలు చేయలేని స్థితిలోకి రాష్ట్రాలు వెళ్లిపోతున్నాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో పవర్ కట్స్ మొదలైపోయాయి. ముందుంది మొసళ్ల పండగంటూ హెచ్చరించిన మరుసటి రోజే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. ప్రతిరోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా విద్యుత్ అధికారులు తెలిపారు.

అయితే, ఫుడ్ బేస్డ్ పరిశ్రమలకు మాత్రం పవర్ కట్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోకపోతే వేసవిలో పరిస్థితి ఘోరంగా ఉంటుందంటూ హెచ్చరించారు. కనీసం నాలుగు గంటలపాటు ఏసీలు ఆపేయాలని సూచిస్తున్నారు.గతంతో పోలిస్తే ఏపీలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఇంతకుముందు రోజుకి 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే… ఇప్పుడు 195 మిలియన్ యూనిట్స్ అవసరమవుతోంది. అయితే, 45శాతం థర్మల్ విద్యుదుత్పత్తి పడిపోవడంతో సంక్షోభం మొదలైంది.

Read Also…CM Jagan: సీఎం జగన్‌‌కు సర్‌ప్రైజ్.. చాలా కష్టం, కాస్ట్లీ కూడా! వీడియో