PM Modi: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానా, చండీగఢ్ , పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 26,800 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటన రవాణా, విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ ప్రాంత రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా సాగనుంది.

దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హర్యానా పర్యటనలో భాగంగా ఈ ట్రైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. జింద్-సోనిపట్ మధ్య రాకపోకలు సాగించే ఈ ట్రైన్ భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలుగా నిలవనుంది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడిచే ఈ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. 10 కోచ్లతో రూపొందించిన ఈ రైలు, 3,200 హార్స్ పవర్ ప్రొపల్షన్ వ్యవస్థతో నడుస్తూ, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మరో రూ. 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వేను కూడా మోదీ ప్రారంభించనున్నారు.. దీనివల్ల ఢిల్లీ-కత్రా ప్రయాణ సమయం 14 గంటల నుంచి 6 గంటలకు తగ్గనుంది. కురుక్షేత్రలో సిక్కు గురువుల త్యాగాలను, సంస్కృతిని ప్రతిబింబించేలా సిక్కు మ్యూజియానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలు, ఆసుపత్రులను జాతికి అంకితం చేయనున్నారు.
చండీగఢ్లో ఆరోగ్య, విద్యా మౌలిక సదుపాయాలు
ఇక చండీగఢ్లో పర్యటనలో భాగంగా రూ. 6,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. పీజీఐఎంఈఆర్ (PGIMER) అత్యాధునిక మాతృ, శిశు కేంద్రం, న్యూరోసైన్సెస్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. మొహాలీ-కురాలీ 6-లేన్ల హైవేతో పాటు, జిరాక్పూర్ బైపాస్కు శంకుస్థాపన చేయడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు.
పంజాబ్లో అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం
పంజాబ్ పర్యటనలో భాగంగా జలంధర్లో రూ. 5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇందులో జలంధర్ కంటోన్మెంట్ కూడా ఉంది. దౌలత్పూర్ చౌక్-కర్తోలి కొత్త రైలు మార్గం, అమృత్సర్-వారణాసి మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య అనుసంధానం మెరుగుపడనుంది.
ఈ పర్యటన ద్వారా ఈ మూడు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక, లాజిస్టిక్స్ ల రవాణా వ్యవస్థలు మరింత వేగవంతం కావడమే కాకుండా, సామాన్య ప్రజలకు అత్యుత్తమ వైద్య, విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
