భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ (UK) మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగు పడింది. రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం( CETA) కుదిరింది. ఇది ద్వైపాక్షిక వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. పెట్టుబడుల పెంపు, సులువైన వాణిజ్య పద్ధతులు, సేవల రంగంలో విస్తృత అవకాశాలు నిపుణుల ఉపాధి అవకాశాల మెరుగుదలే లక్ష్యంగా ఈ చారిత్రాత్మక ఒప్పందం రూపుదిద్దుకుంది.

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారత్- బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్కు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 99 శాతం ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా రద్దు కానున్నాయి. ఇది భారతీయ వస్తువుల అంతర్జాతీయ పోటీతత్వాన్ని భారీగా పెంచడంతో పాటు భారతదేశంలోని సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా దశలవారీగా టారిఫ్ తగ్గింపులను వర్తింపజేస్తూ భారత్ తగిన జాగ్రత్తలు తీసుకుంది.
బలమైన ఆర్థిక భాగస్వామ్యం
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్, యూకేలు రెండు కూడా బలీయమైన ఆర్థిక శక్తులుగా ఉన్నాయి. 2025 గణాంకాల ప్రకారం భారత్ జీడీపీ 3.96 ట్రిలియన్ డాలర్లు కాగా, యూకే ఆర్థిక వ్యవస్థ 3.84 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2025-26లో ఇరు దేశాల మధ్య వస్తు వాణిజ్యం 25.12 బిలియన్ డాలర్లకు చేరగా.. ఇందులో భారత్ ఎగుమతులు 13.44 బిలియన్ డాలర్లు, దిగుమతులు 11.68 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనివల్ల భారత్కు 1.76 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు లభించింది. 2024లో రెండు దేశాల మధ్య సేవల వాణిజ్యం 35.44 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో బ్రిటన్కు భారత్ 21.66 బిలియన్ డాలర్ల సేవలను ఎగుమతి చేసి, 7.88 బిలియన్ డాలర్ల సేవల వాణిజ్య మిగులును సాధించింది.
ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు?
యూకే మార్కెట్లో టారిఫ్ రద్దు కావడం వల్ల భారతీయ వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగి, రైతులకు ఆదాయం పెరుగుతుంది. అలాగే టెక్స్టైల్స్ , లెదర్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ , హస్తకళలు, ఆటో కాంపోనెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఎగుమతులు పుంజుకోనున్నాయి. దీంతో దేశంలో లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీని వల్ల నిరుద్యోగం తగ్గనుంది. ఉపాది అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
ఈ ఒప్పందం చిన్నా, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఎంతో సమాపడుతుంది. డిజిటల్ సర్టిఫికేషన్, పేపర్లెస్ ట్రేడ్, సరళీకృత కస్టమ్స్ విధానాల వల్ల చిన్న పరిశ్రమల ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా బ్రిటన్లోకి ప్రవేశించే భారతీయ ఉత్పత్తులపై 4శాతం నుండి 16శాతం వరకు టారిఫ్ ఆదా అవుతుంది.
అలాగే ఐటీ రంగ అభివృద్ధికి కూడా ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. యూకే సేవల మార్కెట్లో భారత్కు మునుపెన్నడూ లేనంతటి అనుకూలమైన అవకాశాలు లభించాయి. పరస్పర విద్యార్హతల గుర్తింపు, నిపుణుల కదలికలకు వీలు కల్పించడం ద్వారా భారతీయ యువ ప్రతిభావంతులకు కొత్త ఉపాధి మార్గాలు తెరుచుకోనున్నాయి. దీంతో పాటు ఈ ఒప్పందంలో మహిళా వ్యాపారవేత్తలు, యువత, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక నిబంధనలను చేర్చారు.
సరిహద్దుల్లో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, డిజిటల్ వాణిజ్యం, ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ వంటి భవిష్యత్ అంశాలకు ‘సెటా’ (CETA) అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. కేవలం వ్యాపార ఒప్పందంగానే కాకుండా, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను, మరింత పటిష్టమైన సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఇది ఒక బలమైన పునాదిగా నిలవనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




